ఎల్ఈడీ వీధి లైట్ల బాధ్యత ఇక సచివాలయాలదే!
ABN , First Publish Date - 2021-06-20T06:47:50+05:30 IST
గ్రామ పంచాయతీల వీధి లైట్ల సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క వీధి లైటు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. వీధి లైట్ల నిర్వహణను కేంద్ర విద్యుత్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఈఈఎస్ఎల్కు అప్పగించిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థను నిర్లక్ష్యం చేయడంతో ఒక కొత్త బల్బు కూడా ఎక్కడా వేయలేదు.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
గ్రామ పంచాయతీల వీధి లైట్ల సమస్య ఎట్టకేలకు ఓ కొలిక్కి వస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్క వీధి లైటు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. వీధి లైట్ల నిర్వహణను కేంద్ర విద్యుత్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన ఈఈఎస్ఎల్కు అప్పగించిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్థను నిర్లక్ష్యం చేయడంతో ఒక కొత్త బల్బు కూడా ఎక్కడా వేయలేదు. నిర్వహణ లేదు. చివరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, గ్రామ సర్పంచ్లు వీధి లైట్ల కోసం లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఎల్ఈడీ వీధి లైట్ల నిర్వహణ, ఆపరేషన్ బాధ్యతలను సచివాలయాలకు అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపఽథ్యంలో డివిజన్ స్థాయిలోను, గ్రామ పంచాయతీ స్థాయిలోను ఎల్ఈడీ విడిభాగాల స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో రాజమహేంద్రవరం డివిజన్కు సంబంధించి ధవళేశ్వరంలోను, అమలాపురం డివిజన్కు ఈదరపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాలును, పెద్దాపురం డివిజన్కు పెద్దాపురంలోను, కాకినాడ డివిజన్కు రమణయ్యపేటలోను, రంపచోడవరం డివిజన్కు రంపచోడవరంలోను డివిజన్ స్థాయి స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రధాన సచివాలయాల్లో నిర్ణీత కొలతలతో కప్బోర్డులు ఏర్పాటు చేయమని ఆదేశించారు. ఇక ఆ బాధ్యత పంచాయతీల పరిధిలోనే ఉంటుంది. అయినా ఇంకా ఎల్ ఈడీ వీధి లైట్ల సరఫరా మొదలు కాలేదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వీధిలైట్లు లేవు. ఈ సమస్యపై ఆయా గ్రామాల సర్పంచ్ల వద్దకు ప్రజలు వీధిలైట్ల కోసం అనేక విన్నపాలు చేస్తున్నారు. వర్షాకాలం వచ్చేస్తున్నందున త్వరగా ఎల్ఈడీ వీధి లైట్లను వేయించాలని ప్రజలు కోరుతున్నారు.