లీజు భూములపై సర్కారు కన్ను!

ABN , First Publish Date - 2022-06-03T08:29:43+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లీజు భూముల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం

లీజు భూములపై సర్కారు కన్ను!

కలెక్టర్లకు సీఎస్‌ సోమేశ్‌ ఆదేశాలు

ఈ నెల 10 వరకు గడువు

ఆ భూములను వేలం వేసే చాన్స్‌!

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లీజు భూముల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలు, కంపెనీలు, ప్రైవేట్‌ అసోసియేషన్లు, సొసైటీలు, సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రైవేట్‌ వ్యక్తులకు నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూముల వివరాలను సేకరించే పనిలో ప్రభుత్వం పడింది. ఆ చిట్టాను అందజేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఓ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ నెల 10వ తేదీలోగా ఆయా వివరాలను అందజేయాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు కూడా తమ పరిధిలోని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆదేశాలిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల లోపు మండలాల వారీగా భూముల వివరాలన్నీ అందించాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఆ మేరకు ఓ ప్రొఫార్మాను పంపించారు. అందులో.. మండలం, గ్రామం, సర్వే నంబరు, లీజుకు తీసుకున్న వారి పేరు, విస్తీర్ణం, లీజు కాలపరిమితి, లీజుకు తీసుకోవడం వెనక నిర్దేశించిన లక్ష్యం, ఏయే జీవోల కింద లీజు ఇచ్చారు?అనే వివరాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో.. ఆంధ్రప్రదేశ్‌(తెలంగాణ ఏరియా)గ్రాంట్‌ ఆఫ్‌ లీజ్‌ అండ్‌ ల్యాండ్స్‌ ఫర్‌ నాన్‌ అగ్రికల్చర్‌ పర్పస్‌ రూల్స్‌-1977 ప్రకారం..1992 అక్టోబరు 10న విడుదల చేసిన జీవోనెం. 1024, 2012 సెప్టెంబరు 14న భూముల కేటాయింపు పాలసీ కోసం విడుదల చేసిన జీవోనెం.571 ప్రకారం భూములను లీజుకు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఆ భూముల చిట్టాను సేకరించి, గడువు ముగిసిన భూముల లీజులను రద్దు చేయాలని భావిస్తోంది. ఆదాయం కోసం ఆయా భూములను వేలం వేసే అవకాశాలున్నాయి. 

Updated Date - 2022-06-03T08:29:43+05:30 IST