ప్రియాంక పర్యటనలో రాజీనామాల పర్వం

ABN , First Publish Date - 2021-12-10T20:53:52+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు గోవాలో శుక్రవారం పర్యటన సందర్భంగా పలువురు పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి..

ప్రియాంక పర్యటనలో రాజీనామాల పర్వం

పనజి: అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు గోవాలో శుక్రవారం పర్యటన సందర్భంగా పలువురు పార్టీ నేతలు  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలకు ప్రియాంక సిద్ధమవుతున్న తరుణంలోనే పలువురు రాజీనామాలు సమర్పించారు. భావసారూప్యం కలిగిన పార్టీలతో కాంగ్రెస్ పొత్తుల విషయంలో అయోమయం నెలకొనడం ఇందుకు కారణంగా చెబుతున్నారు.


పోర్వోరిమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం పార్టీకి రాజీనామా చేశారు. 2020 ఎన్నికల్లో పోటీ విషయాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, కొందరు పార్టీ నేతల ధోరణితో ఇంకా ప్రచారమే మొదలు కాలేదని పోర్వోరిమ్‌ నియోజకవర్గం నుంచి రాజీనామాలు చేసిన నేతల బృందానికి నాయకత్వం వహిస్తున్న జిల్లా పరిషత్ మాజీ సభ్యుడు గూపేష్ నాయక్ తెలిపారు.


కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. సౌత్ గోవాకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత గోవా మోరెనో రెబెలో తన రాజీనామాను సమర్పించారు. కర్టోరియం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అలెక్సో రెజినాల్డో పార్టీ వ్యతిరేక కార్యక్రలాపాలకు పాల్పడినప్పటికీ అతనికి టిక్కెట్ ఇవ్వడంపై రెబెలో అసంతృప్తితో ఉన్నారు. నాలుగున్నరేళ్లుగా ఎలాంటి పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడమే కాకుండా, పార్టీ నేతలను కించపరుస్తూ వ్యవహరిస్తున్న రెజినాల్డోను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమోట్ చేయడమే కాకుండా అతని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ఏమటని నిలదీస్తూ గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిరీష్ చోడన్కర్‌ను ఆయన ఓ లేఖలో నిలదీశారు.


జీఎఫ్‌పీతో పొత్తు ఉంటుందా?

గోవా ఫార్వార్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)తో కాంగ్రెస్ పొత్తు వ్యవహారం కూడా ఇంకా కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌కు జీఎఫ్‌పీ మద్దతు ప్రకటించిందని, పొత్తుల వ్యవహారం ఇప్పుడే చెప్పలేమని ఏఐసీసీ గోవా ఎన్నికల ఇన్‌చార్జి పి.చిదంబరం గురువారంనాడు పేర్కొన్నారు. ఈ క్రమంలో జీఎఫ్‌పీ చీఫ్ విజయ్ సర్దేశాయ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత గుండూరావు శనివారం సమావేశం కానున్నారు. కాగా, ప్రియాంక ఒకరోజు గోవా పర్యటనలో భాగంగా యువకులు, మహిళలతో ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Updated Date - 2021-12-10T20:53:52+05:30 IST