రెండో డిప్యూటీ మేయర్గా నాయకల్లు అరుణ
ABN , First Publish Date - 2021-07-31T05:56:32+05:30 IST
నగర పాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా 47 డివిజన్ కార్పొరేటర్ నాయకల్లు అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కర్నూలు(అర్బన్), జూలై 30: నగర పాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్గా 47 డివిజన్ కార్పొరేటర్ నాయకల్లు అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాలులో కమిషనర్ డీకే బాలాజీ ఆధ్యర్యంలో సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా వ్యవహరించారు. సమావేశానికి పలువురు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. హాజరైన వారు ప్రేక్షక పాత్ర వహించారు. వారం రోజులుగా డిప్యూటీ మేయర్ పదవి కోసం మైనార్టీ, ఎస్సీ సామాజిక వర్గాల మధ్య పోటీ నడిచింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ పేరు తెరపైకి రావడం విశేషం. ఎమ్మెల్యేలను పట్టుబట్టి నాయకల్లు అరుణ రెండో డిప్యూటీ మేయర్గా ఎన్నుకున్నారన్న చర్చ సాగుతోంది. డిప్యూటీ మేయర్ నాయకల్లు అరుణ అభ్యర్థిత్వాన్ని 44వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరరెడ్డి, 7వ డివిజన్ కార్పొరేటర్ జుబేర్ ప్రతిపాదించగా సభ్యులు ఆమోదం తెలిపినట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్రెడ్డి, మేయర్ బీవై రామయ్య, డిప్యూటీమేయర్ సిద్ధారెడ్డి రేణుక.. నాయకల్లు అరుణను అభినందించారు. వారు మాట్లాడుతూ మహిళలకు రెండు డిప్యూటీ మేయర్ పదవులు ఇచ్చి ప్రభుత్వం వారికి పెద్దపీట వేసిందన్నారు. దళిత వర్గానికి చెందిన మహిళ కావడం, ఉన్నత విద్యావంతురాలు కావడంతో అరుణకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు.