‘టీఆర్ఎస్లో నేను ఉండలేను.. గుడ్బై చెబుతున్నా...’
ABN , First Publish Date - 2021-06-14T14:25:56+05:30 IST
కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతుండడాన్ని భరించలేక టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెబుతున్నట్టు
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్తోపాటు ఆయనకు అండగా ఉన్న తమ లాంటి వారిపై కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతుండడాన్ని భరించలేక టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెబుతున్నట్టు కంటోన్మెంట్ పాలక మండలి మాజీ ఉపాధ్యక్షుడు సాద కేశవరెడ్డి ప్రకటించారు. దేవరయాంజల్ భూముల విషయంలో ఈటలతోపాటు తమలాంటి ఎంతో మందిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, కేసులు బనాయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
తాము ఏ తప్పూ చేయలేదని, నిబంధనల ప్రకారమే భూములు కొనుగోలు చేశామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీకి కూడా తాము ద్రోహం చేయలేదన్నారు. కంటోన్మెంట్లో సాద కేశవరెడ్డి మొహం చూసి గడిచిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని, భారీ మెజారిటీ కట్ట పెట్టారని చెప్పారు. ఈనెల 14వ తేదీన మాజీ మంత్రి ఈటల రాజేందర్తోపాటు ఢిల్లీలో తాను కూడా బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు ఆయన ప్రకటించారు.