హిందువులను బెదిరించిన లాయర్ సోహిల్ హుస్సేన్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-02-22T20:21:05+05:30 IST
ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి
రాజ్కోట్ : ‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలి’’ అని హిందువులను బెదిరించిన న్యాయవాది సోహిల్ హుస్సేన్ మోర్పై కేసు నమోదైంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ను కించపరుస్తూ ఆదివారం వాట్సాప్ గ్రూప్లో ఓ పోస్ట్ పెట్టినట్లు, మతపరమైన మనోభావాలను గాయపరచినట్లు, విధులను నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారిని ఆటంకపరచినట్లు రెండు ప్రథమ సమాచార నివేదికలు (ఎఫ్ఐఆర్)లను నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుజరాత్లోని రాజ్కోట్, శ్యామాప్రసాద్ ముఖర్జీ నగర్ ఆవాస్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఈ రెసిడెన్షియల్ సొసైటీ ఓ వాట్సాప్ గ్రూపును నిర్వహిస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ను కించపరుస్తూ సోహిల్ హుస్సేన్ ఈ గ్రూపులో ఓ పోస్ట్ పెట్టారు. ఈ గ్రూపు సభ్యురాలు జ్యోతి సోధా ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోహిల్కు ఫోన్ చేసి, తన అభ్యంతరాలను తెలిపారు. దీంతో రెచ్చిపోయిన సోహిల్ స్పందిస్తూ, ‘‘ఇప్పుడు ఈ దేశం పాకిస్థాన్ అయింది, మీరంతా దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నవారంతా ముస్లింలే. హిందువులంతా వెళ్ళిపోవాలి’’ అని గర్జించాడు. అందుకు జ్యోతి ప్రతిస్పందిస్తూ ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించగా, ఆయన మరింత రెచ్చిపోయి, ఆగ్రహంతో ఊగిపోతూ, ‘‘అదంతే, ఇక వెళ్ళిపో’’ అని అన్నారు. అనంతరం ఆమె స్వయంగా ఆయన వద్దకు వెళ్లి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని కోరారు. దీంతో ఆయన మరింత ఆగ్రహంతో ఆమెను కత్తితో పొడిచి చంపుతానని బెదిరించారు. అక్కడితో ఆగకుండా గణేశుని విగ్రహాన్ని పగులగొట్టి, నాశనం చేశారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ కానిస్టేబుల్ రావత్ దంగర్ వచ్చి, పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేయగా, సోహిల్ ఆ కానిస్టేబుల్ను దూషిస్తూ, కొట్టారు. ఈ ఘర్షణను ఓ గుజరాతీ టీవీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. దంగర్ ఆదివారం రాత్రి సోహిల్పై ఫిర్యాదు చేశారు. సోహిల్ను సోమవారం అరెస్టు చేశారు.
ఇదిలావుండగా, ఈ కాలనీవాసి ఒకరు మాట్లాడుతూ, సోహిల్ హుస్సేన్ ఇటీవలి వరకు తమతో బాగానే మాట్లాడేవారని చెప్పారు. కొంత కాలం నుంచి ఆయన అతివాద ధోరణిని ప్రదర్శిస్తున్నారని, గణేశుని విగ్రహాన్ని ధ్వంసం చేశారని చెప్పారు. ద్వారబంధంపై అలంకరణగా పెట్టుకున్న తోరణంలోని గణేశుని ఫొటోలన్నిటినీ నాశనం చేశాడన్నారు. ఈ సొసైటీని పూర్తిగా పాకిస్థాన్గా మార్చేస్తామని, హిందువులంతా వెళ్ళిపోవాలని అన్నాడని చెప్పారు. తనకు అతి పెద్ద శక్తులు మద్దతిస్తున్నాయని చెప్పాడన్నారు. ఆయన అతివాద ప్రవర్తన వెనుక చాలా పెద్ద బృందం ఉండి ఉండవచ్చునని చెప్పారు.