కొత్తదారిలో నడవాలనుకుంటున్నా

ABN , First Publish Date - 2021-02-28T08:50:43+05:30 IST

‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచి పక్కింటి అమ్మాయి, గ్లామర్‌ పాత్రలు చాలా చేశా. చేసిన పాత్రలే చేసి విసుగొచ్చింది. చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తదారిలో నడవాలనుకుంటున్నా.

కొత్తదారిలో నడవాలనుకుంటున్నా

‘‘కెరీర్‌ బిగినింగ్‌ నుంచి పక్కింటి అమ్మాయి, గ్లామర్‌ పాత్రలు చాలా చేశా. చేసిన పాత్రలే చేసి విసుగొచ్చింది. చేయాల్సిన పాత్రలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తదారిలో నడవాలనుకుంటున్నా. అందుకు నాందిగా ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’ చేశా. ఈ చిత్రం నాలోని కొత్త నటిని బయటకు తెస్తుంది’’ అని లావణ్యా త్రిపాఠీ అన్నారు. సందీప్‌ కిషన్‌ సరసన ఆమె నటించిన చిత్రమిది. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా లావణ్యా త్రిపాఠీ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. 


‘‘సందీప్‌ కిషన్‌ నాకు మంచి స్నేహితుడు. హాకీ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నానని చెప్పి మాతృకలోని ప్రచార చిత్రాలు చూపించాడు. ఇందులో కథానాయికది గట్స్‌ ఉన్న పాత్ర. ధైర్యంగా ఉండడం, ముక్కుసూటిగా మాట్లాడడం వంటివి నా జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది. ఇలాంటి అవకాశం వస్తే వదులుకోకూడదు అనుకున్నా. అదే విషయం సందీప్‌కి చెప్పా. ఫైనల్‌గా ఈ సినిమాలో కథానాయికగా అవకాశం అందుకున్నా. మాతృకకు ఈ చిత్రానికి 60 శాతం కథ మారింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హాకీ శిక్షణ తీసుకుని షూటింగ్‌కి వెళ్లా. ప్రస్తుతం ప్రతి క్రీడా రంగంలోనూ పాలిటిక్స్‌ ఉన్నాయి. దాని వల్ల ప్రతిభ గలవారు అవకాశాలు కోల్పోయి క్రీడారంగంలో ఎదగలేకపోతున్నారు అన్న విషయాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఇందులో లవ్‌ ట్రాక్‌తోపాటు చక్కని సందేశం కూడా ఉంది. 


ఒకే నెల.. రెండు సినిమాలు...

మార్చిలో వరుసగా రెండు సినిమాలు విడుదలకానున్నాయి. ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’, ‘చావు కబురు చల్లగా’ రెండు సినిమాల్లోనూ వైవిధ్యమైన పాత్రలే. అవుట్‌పుట్‌ పట్ల చాలా నమ్మకంగా ఉన్నా. ఈ నెల నాకు కలిసొస్తుందా లేదా అన్నది సినిమా సక్సెస్‌ మీద ఆధారపడి ఉంటుంది. లాక్‌డౌన్‌లో ఓటీటీ కంటెంట్‌ ఆఫర్స్‌ చాలా వచ్చాయి. కథల్లో కొత్తదనం లేక అంగీకరించలేదు. బయోపిక్‌, నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలు చేయాలనుంది. వాటిలో నటించడానికి ఆస్కారం ఉంటుంది. 

Updated Date - 2021-02-28T08:50:43+05:30 IST