మానవ అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్ల ముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
ABN , First Publish Date - 2022-07-03T00:35:35+05:30 IST
మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రమబద్ధమైన మార్పులకు మార్గదర్శకత్వం వహించిన
హైదరాబాద్: మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో క్రమబద్ధమైన మార్పులకు మార్గదర్శకత్వం వహించిన వ్యక్తులను ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సత్కరించింది. తెలంగాణా రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్తో పాటు పలువురు ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాస్యధృత సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ అండ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థ ‘శక్తి’ శీర్షికన ఓ నృత్య రూపకం ప్రదర్శించింది.
మోహినియాట్టం నృత్యకారిణి అనితా ముక్తశౌర్య ప్రత్యేకంగా ఈ నృత్య రూపకాన్ని సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ కోసం రూపొందించారు. మానవ అక్రమ రవాణా బారిన పడి తప్పించుకున్న మహిళల వ్యక్తిగత అనుభవాల స్ఫూర్తితో తీర్చిదిద్దిన శక్తి నృత్య రూపకాన్ని తొలిసారిగా 2018లో దక్షిణాసియా సదస్సులో ప్రదర్శించారు.
ప్రజ్వల సత్కార కార్యక్రమంలో జరిగిన శక్తి నృత్యరూపకంలో శాస్త్రీయ నృత్య కారిణిలు అనితా ముక్తశౌర్య, శరణ్య కేదార్నాథ్, సుజి పిళ్లై, కృతి నాయర్, షాలికా పిళ్లైలు మోహినియాట్టాన్ని, దేబశ్రీ పట్నాయక్ ఒడిస్సీ నృత్యాన్ని, శ్రీదేవి, వైష్ణవి, భాగవతుల విదూషి. విభూతిలు భరతనాట్యం, అమీ కుమార్, తలారి నవోనికాలు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.
అమాయక ప్రజలు నుంచి ఎవరూ అక్కున చేర్చుకోని వ్యక్తులుగా సమాజంలో మిగిలిపోవడం వరకూ హృదయ విదారకరమైన సంఘటనలకు ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తుల జీవితాలను నృత్యకారిణిలు కళ్లముందుంచారు. ప్రతి ఒక్కరూ భయపడే వారి జీవితాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అన్యాయం అంటే ఏమిటనేది ప్రశ్నించారు.
బాధ, అణచివేత, గాయం, అవమానం, విలువలేని వ్యక్తిగా పరిగణించడంతో పాటుగా చాలాసార్లు తమ సొంత కుటుంబం, సమాజం నుంచి బహిష్కరించినప్పటికీ ధీరోదాత్తంగా పోరాడే వారి అంతర్గత శక్తిని ఈ శక్తి నృత్యరూపకం కళ్ల ముందుంచింది.