కరోనాతో కన్నుమూసిన టాక్‌షో దిగ్గజం

ABN , First Publish Date - 2021-01-24T02:09:56+05:30 IST

ఇంటర్వ్యూలతో దాదాపు అర్ధ శతాబ్దంపాటు అమెరికాను ఊపేసిన టాక్ షో దిగ్గజం లారీ కింగ్ కన్నుమూశారు. ఆయన

కరోనాతో కన్నుమూసిన టాక్‌షో దిగ్గజం

లాస్ఏంజెలెస్: ఇంటర్వ్యూలతో దాదాపు అర్ధ శతాబ్దంపాటు అమెరికాను ఊపేసిన టాక్  షో దిగ్గజం లారీ కింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.  ప్రపంచ నేతల నుంచి సినీ దిగ్గజాల వరకు ఎంతోమంది ఇంటర్వ్యూలు చేసిన ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. లాస్ఏంజెలెస్‌లోని సెడార్స్-సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఆయన తుదిశ్వాస విడిచినట్టు  ఓరా మీడియా తెలిపింది.


టెలివిజన్ ప్రొడక్షన్ స్టూడియో అయిన ఓరా మీడియాకు లారీ కింగ్ సహ వ్యవస్థాపకుడు.  ఆయన మరణించినట్టు పేర్కొన్నప్పటికీ కారణాన్ని మాత్రం ఓరా మీడియా వెల్లడించలేదు. అయితే, కరోనా వల్లే ఆయన మరణించినట్టు తెలుస్తోంది. లారీ కింగ్ కరోనా బారినపడి వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఈ నెల 2న సీఎన్ఎన్ పేర్కొంది. 


జాతీయ రేడియోలో దీర్ఘకాలంపాటు పనిచేసిన లారీ కింగ్.. 1985 నుంచి 2010 వరకు సీఎన్ఎన్‌కు సేవలు అందించారు. అక్కడాయన రెండు పీబాడీ అవార్డులు సహా ఎన్నో పురస్కరాలు అందుకున్నారు.  సెలబ్రిటీలు, రాజకీయ చర్చలు, సమయోచిత చర్చలు చేయడమే కాదు.. ప్రతి ఇంటర్వ్యూకి ఎంతో ఉత్సుకత తీసుకొచ్చేవారు.  కింగ్ ఇంటర్వ్యూ కోసం ఎదురుచూసేంతలా జనాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు.


దాదాపు 50 వేల ఇంటర్వ్యూలు చేశారు. 1995లో పీఎల్ఓ చైర్మన్ యాసర్ అరాఫత్, జోర్డాన్ రాజు కింగ్ హుస్సేన్, ఇజ్రాయెల్ ప్రధాని యిట్జాక్ రాబిన్‌లతో కలిసి మధ్య ప్రాచ్య శాంతి శిఖరాగ్ర సమావేశానికి కింగ్ అధ్యక్షత వహించారు. దలైలామా నుంచి ఎలిజబెత్ టేలర్ వరకు, మిఖాయిల్ గోర్బచేవ్ నుంచి బరాక్ ఒబామా వరకు, బిల్ గేట్స్ నుంచి లేడీ గాగా వరకు ఎందరినో ఆయన ఇంటర్వ్యూ చేశారు. 

Updated Date - 2021-01-24T02:09:56+05:30 IST