21న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి

ABN , First Publish Date - 2022-08-18T06:23:21+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

21న పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

- వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): స్వాతంత్య్ర  వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా హరితహారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. గ్రామ పంచాయతీల్లో నాటిన మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ పథకం కింద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతకుమారి మాట్లాడుతూ ఎనిమిదో విడత హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటి వరకు మూడువంతులు పనులు పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ మాట్లాడుతూ ఎల్‌ఎండీ కాలనీతోపాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాల్లో ఈ నెల 21వ తేదీలోగా ఐదు లక్షలు మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలతరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, డీపీవో వీరబుచ్చయ్య, డీఎం ఇండస్ర్టీస్‌ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-18T06:23:21+05:30 IST