పర్యాటక కేంద్రంగా పెద్దపాడు చెరువు
ABN , First Publish Date - 2020-12-05T05:14:05+05:30 IST
నగర సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పెద్దపాడు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
గుజరాతీపేట:నగర సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పెద్దపాడు చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ చెరువును ఆహ్లాదకరంగా మార్చేందుకు గల అవకాశాలను కలెక్టర్ నివాస్ శుక్రవారం పరిశీలించారు. డ్వామా పీడీ హెచ్.కూర్మారావు, సర్వే సహాయ సంచాల కుడు కె.ప్రభాకర్, తహసీల్దార్ వైవీ ప్రసాద్లతో కలసి చెరువును పరిశీలించారు. గట్టుపై వాకింగ్ ట్రాక్, చెరువులో బోటింగ్, లేజర్ లైటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉందన్నారు. అలాగే, నవభారత్ జంక్షన్ నుంచి పాత బ్రిడ్జి వరకు రహదారి విస్తరణ పూర్తవడంతో ఈ ప్రాంతంలో కూడా ఉద్యానవ నాన్ని ఏర్పాటు చేసేందుకు పాలిటెక్నిక్ కళాశాల వద్ద స్థలాన్ని పరిశీలించారు.
రోడ్లు పూర్తి చేయాలి
జిల్లాలోని రాష్ట్ర హైవే రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ నివాస్ ఆదేశించారు. శుక్రవారం జడ్పీ మందిరంలో ఆర్అండ్బీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కొమనాపల్లి-సరుబుజ్జిలి, నారాయణ పురం, కిమ్మి-రుషింగి వంతెనల నిర్మాణాలపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, శ్రీకాకుళం,టెక్కలి ఈఈలు గౌరీశ్వరరావు, సత్యనారాయణలు పాల్గొన్నారు.