బొమ్మరాసిపేటలో భూముల అలజడి

ABN , First Publish Date - 2022-06-29T06:15:34+05:30 IST

బొమ్మరాసిపేటలో భూముల అలజడి

బొమ్మరాసిపేటలో భూముల అలజడి
బొమ్మరాసిపేట గ్రామంలో సాగవుతున్న కూరగాయల చేను

  • బ్లాక్‌లిస్టులో వందల ఎకరాల రైతుల భూములు
  • భూములకు తామే అసలు వారసులమంటూ తెరపైకి కొందరు.. జీపీఏ దారులమంటూ మరికొందరు!
  • కోర్టుకెక్కిన భూ వివాదాలు 
  • దశాబ్దాలుగా భూములు సాగుచేసుకుంటున్న రైతుల్లో నెలకొన్న ఆందోళన
  • అధికార పార్టీ పెద్దలే ఇదంతా చేస్తున్నారని ఆరోపణ
  • కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసిన రైతులు

మేడ్చల్‌, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అవన్నీ నగర శివార్లలోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో పంట పొలాలు. ఇక్కడ ఉన్న 1,045 ఎకరాలను కొన్ని దశాబ్దాల కిందటే రైతులు, రిటైరైన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఓ రాజకీయనాయకుడి కుటుంబీకుల నుంచి కొ న్నారు. వీరందరికీ తెలంగాణ(కొత్త) పట్టా పాస్‌పుస్తకాలున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోనూ వీరే ఉన్నారు. దశాబ్దాలుగా కూరగాయ, ఇతర పంటలు సాగుచేసుకుంటున్నారు. ఇటీవ ల ఈ రైతుల రిజిష్టర్డ్‌ ఫోన్‌ నెంబర్లకు మెసేజ్‌లు రావ డం కలవరాన్ని రేకిత్తించింది. ఈ మెసేజ్‌ల సారంశమేమిటం టే.. ‘‘ఇందులో కొన్ని ఎకరాల భూములకు సంబంధించి మ్యుటేషన్‌కు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ సర్వే నంబర్‌ భూములన్నీంటినీ అధికారులు బ్లాక్‌లిస్టులో పెట్టారు.’’ అని. దీంతో ఆ రోజు నుంచి రైతుల కంటిమీద కునుకు లేదు. అదేమని రెవెన్యూ అధికారులను అడిగితే కో ర్టు దేశాలతో కొందరు మ్యుటేషన్‌కు దరఖాస్తుచేసుకున్నార ని, కోర్టు వివాదంలో ఉన్న భూములని బ్లాక్‌లిస్టులో పెట్టామని చెప్పారు.. పట్టా పాస్‌పుస్తకాలున్నా ఈ కొత్త వివాదమేమిటని రైతులు రెండు రోజుల కిందట కలెక్టరేట్‌కు వచ్చి నెత్తీనోరూ కొట్టుకున్నారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. పో లీసులు వారిని అదుపులో తీసుకొని తర్వాత తరువాత వదిలేశారు. భూములను బ్లాక్‌లి్‌స్టలో పెట్టడంతో రైతులు ఆం దోళన చెందుతున్నారు. ఈ భూవివాదం వెనుక పెద్దలు, అ ధికార పార్టీకి చెందిన నేతల పేర్లు కూడా ఉన్నట్లు ఆరోపణలొస్తున్నాయి. వందల కోట్ల విలువైన ఈ భూముల వివాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 


  • ఇదీ వ్యవసాయ భూముల చరిత్ర..

1965లో ఉమ్మడి రాష్ట్రంలో మాజీ రాజ్య సభ్యుడు దుగ్గిరాల బలరామకృష్ణయ్య శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేటలో సర్వే నెంబరు 323 నుంచి 409లో ఉన్న 1,045ఎకరాల భూమిని తన కుటుంబీకులు, బంధువుల పేర కొనుగోలు చేశారు. ఈ భూములను ఆయన 21మంది పేరున పౌతి పట్టాగా చేశారు. ఈ భూములన్నింటిని 1965 నుంచి 1970లోపు 95మంది రైతులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, ఇతరులు కొన్నారు. ఈ భూములన్నీ 95 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పట్టాపాసు పుస్తకాలూ వచ్చాయి. ప్రశాంతంగా ఉన్న రైతుల జీవితాల్లో ఇపుడు అలజడి మొదలైంది. బలరామకృష్టయ్య వారసులమంటూ కొందరు ఈ భూములపై కోర్టులో దావావేశారు. వీరితో పాటు దుగ్గిరాల కుటుంబం తమకు జీపీఏ ఇచ్చిదంటూ యుగేందర్‌ బాబు అనే వక్తి 2016లో 95 రిజిస్ట్రేషన్ల ద్వారా 126ఎకరాలు 31 మందికి రిజిస్ట్రేషన్లు చేశాడు. 323 నుంచి 409 తొమ్మిది స ర్వే నెంబర్లలోని 1,045ఎకరాల్లో 126 ఎకరాల మేర రిజిస్ట్రేష న్లు జరిగాయి. ఎల్‌బీనగర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో పని చేస్తున్న రమే్‌షచంద్ర అనే సబ్‌రిజిస్ట్రార్‌ ఈ భూములన్నింటికీ ఆధారాలు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేశాడని రైతులు తెలిపారు. ఈ అధికారి అవినీతి కేసులో సస్పెండ్‌ అయ్యారు. దుగ్గిరాల వారసులుగా చెప్పుకుంటున్న వారు రెవెన్యూ కో ర్టులను ఆశ్రయించారు. ఆర్డీవో, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుల ఉత్తర్వులు వీరికి అనుకూలంగా వచ్చాయి. దీనిపై రైతులు హైకోర్టుకు వెళ్లగా కలెక్టర్‌ మరోసారి విచారించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ భూములపై వివాదాలున్నందున కోర్టులోనే తేల్చుకోవాలని అప్పటికలెక్టర్‌ శ్వేతామహంతి సూచించారు. దుగ్గిరాల బలరామకృష్ణయ్య వారసులుగా చెప్పుకుంటున్న వారు, మరొకరూ హైకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించి ఆరు వారాల్లో వీరి పేర్లు రికార్డుల్లో చేర్చాలని కోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో వీరంతా మ్యుటేషన్‌ కోసం మీసేవల్లో దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులు, అధికారులు తీసుకున్న చర్యలపై కేవీ.రమణారెడ్డి అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. వివాదాలు లేకున్నా ఒకే సర్వే నెంబర్‌ కారణంగా తమ భూములనూ బ్లాక్‌చేశారని విన్నవించారు. దీనిపై కోర్టు స్పందించి ఇక్కడ భూములు అనుభవిస్తూ పట్టాదారుపాస్‌ పుస్తకాలున్న రైతులకు నోటీసులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను తాము ధరణిలో అప్లోడ్‌ చేసినా ఇంత వరకు న్యాయం జరగడం లేదని రైతులంటున్నారు.


  • మూడు నెలల క్రితం భూముల ఆక్రమణకు ..

మూడు నెలల క్రితం యుగేందర్‌బుతోపాటు నల్లగొండ, సూర్యాపేట ప్రాంతాలకు చెందిన 15మంది వచ్చి ఈ భూములన్నీ మా పేరున రిజిస్ర్టేషన్‌ అయ్యాయని, ఖాళీ చే యాలని, బీడుభూముల చదునుకు యత్నించారని రైతులు తెలిపారు. తాము ప్రతిఘటించడంతో వచ్చిన వారు వెళ్లి పోయారన్నారు. ‘మేం రాష్ట్ర మంత్రి అనుచరులం. మాతో పెట్టుకోవద్దు’ అని బెదిరించారని రైతులు చెప్పారు. మా భూములన్నీ పీవోబీకి ఎందుకు చేర్చాలని అడితే అధికారుల సమాధానం చెప్పడం లేదని రైతు సంఘం నాయకుడురవి కిరణ్‌రెడ్డి అన్నారు.


  • వివాదంలో లేని భూములను క్లియర్‌ చేస్తాం : కలెక్టర్‌ 

ఈ భూములపై వివాదాలున్నందునే క్రయవిక్రయాలు జరగకుండా బ్లాక్‌లో పెట్టినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు. కోర్టుల ఆదేశాలతో కొందరు మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. వివాదాలకు సంబంధం లేని భూములేమైనా బ్లాక్‌లిస్టులో చేరితే ఆ భూముల రైతులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తొలగిస్తామన్నారు.

Updated Date - 2022-06-29T06:15:34+05:30 IST