15లోగా పెండింగ్ భూసమస్యలు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-07-31T04:34:39+05:30 IST
పెండింగ్లో ఉన్న భూముల సమస్యలు, వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్ట్ 15లోగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రుతి ఓఝా ఆదేశించారు.
- వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ శ్రుతి ఓఝా
గద్వాల క్రైం, జూలై 30: పెండింగ్లో ఉన్న భూముల సమస్యలు, వివిధ అంశాలపై వచ్చిన దరఖాస్తులను ఆగస్ట్ 15లోగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రుతి ఓఝా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ హాలు నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో తహసీల్దార్తో మాట్లాడారు. హెచ్ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ, లోకాయుక్తా, ముఖ్యమంత్రి పేషీ పిటిషన్లను వెంటనే యాక్షన్ తీసుకొని, 15రోజుల్లో క్లియర్ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్నవాటిని ప్రతీ రోజు ఎన్ని పరిష్కరిస్తున్నారో నివేదిక ఇవ్వాలన్నారు. మండల కేంద్రంలో గ్రీవెన్స్కు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వీఆర్వోలు, వారి విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రస్తుతం విద్యార్ధులకు అవసరమయ్యే ఆదాయం, కులం సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులు తహసీల్దార్ లాగిన్లో ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. ఇసుక రవాణాకు సంబంధించి ట్రాన్స్ఫోర్ట్ బిల్లులపై వ్యాలిడ్ డేట్, స్టాంప్ వేసి, పింక్ కలర్ బిల్లులు మాత్రమే ఇవ్వాలని ఏదైనా సమస్య వస్తే ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మండలాల వారి గా రివ్యూ నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురామ్శర్మ, డీఎస్వో రేవతి, ఆర్డీవో రాములు, ఏడీమైన్స్ అధికారి విజయరామరాజు, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు ఉన్నారు.