ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో భూముల డేటా: విజయశాంతి

ABN , First Publish Date - 2021-12-05T01:35:06+05:30 IST

ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో భూముల డేటా: విజయశాంతి

ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో భూముల డేటా: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్‌లో లోపాలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారని, భూరికార్డుల నిర్వహణ వ్యవస్థను కేసీఆర్ సర్కారు సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో పెట్టిందని ఆమె మండిపడ్డారు. ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారిందని సోషల్ మీడియా వేదికగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. రాములమ్మ పోస్టు యథాతథంగా...

 

''రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన అంటూ తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలతో రాష్ట్రంలోని ప్రజలు... వారిలోనూ ముఖ్యంగా రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నరు. ఇప్పుడు అంతకంటే షాకిచ్చే మరి కొన్ని అంశాలు మీడియా కథనం ద్వారా తాజాగా బయటకొచ్చి రాష్ట్ర సర్కారు దివాలాకోరు పనితీరును బయటపెట్టాయి. అదేమిటంటే... తెలంగాణ రైతుల భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ మొత్తాన్నీ దివాళా బాటపట్టిన టెర్రాసిస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ చేతుల్లో కేసీఆర్ సర్కారు పెట్టింది. ఈ టెర్రాసిస్ గతంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు టెర్రాసిస్‌లో సగానికి పైగా వాటాను ఫిలిప్పీన్స్‌‌కు చెందిన ఫాల్కన్ గ్రూప్‌‌నకు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసింది. ఆ విధంగా మన తెలంగాణ భూముల రికార్డులు విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్లినట్లయింది. దాదాపు 70 లక్షల మంది రైతులకు చెందిన సుమారు కోటిన్నర ఎకరాల భూముల రికార్డులు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, అటవీ శాఖలకు చెందిన మరో కోటి ఎకరాల భూముల సమాచారం ఆర్థికంగా దివాళా తీసిన ఓ కంపెనీకి చేతిలో పడి ఆ భూముల డేటా భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే పరిస్థితి ఏమిటి? ఏవైనా సమస్యలు తలెత్తితే, అప్పుడు ఏకైక ఆధారమైన మాన్యువల్ రికార్డులను పరిరక్షించే చర్యల్ని కూడా సర్కారు చేపట్టడం లేదు. తెలంగాణలో ప్రజల ఆస్తులైన సర్కారు భూములు, రైతుల భూముల డేటా భద్రత విషయంలో ఇంత దారుణమైన నిర్లక్ష్యాన్ని తెలంగాణ సర్కారు ప్రదర్శిస్తోంది. పైగా ఇందుకు సంబంధించిన సమాచారం అడిగిన సమాచార కార్యకర్తలకు సైతం సరైన జవాబు ఇచ్చే దిక్కు లేదు. భూముల ప్రక్షాళన పేరిట రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తున్న ఈ సర్కారును నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉంది''. అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2021-12-05T01:35:06+05:30 IST