దేశంలో కుంటుపడిన పారిశ్రామిక ప్రగతి
ABN , First Publish Date - 2021-12-04T05:46:23+05:30 IST
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు ఐదు లక్షలు పరిశ్రమలు మూతపడ్డాయని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వైటీ దాస్ అన్నారు.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వైటీ దాస్
కూర్మన్నపాలెం, డిసెంబరు 3: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని, సుమారు ఐదు లక్షలు పరిశ్రమలు మూతపడ్డాయని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వైటీ దాస్ అన్నారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 295వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో ఈఆర్ఎస్, సేఫ్టీ, ఈఎస్ఎఫ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో వైటీ దాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో ఉక్కు అంశాన్ని చర్చించి, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వరంగాన్ని రక్షించేందుకు జరుగుతున్న పోరాటం దేశభక్తితో కూడిన సమరమని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ కో కన్వీనర్ కె.సత్యనారాయణ, వేములపాటి ప్రసాద్, గంగవరం గోపి, గంగారావు, సూరిబాబు, రెడ్డి, శ్రీను, రాము, కన్నారావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.