పశుగ్రాసం కుంభకోణం ఐదో కేసులోనూ లాలూ దోషే: సీబీఐ కోర్టు తీర్పు

ABN , First Publish Date - 2022-02-15T18:44:50+05:30 IST

ణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారంనాడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో..

పశుగ్రాసం కుంభకోణం ఐదో కేసులోనూ లాలూ దోషే: సీబీఐ కోర్టు తీర్పు

రాంచీ: దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారంనాడు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ  ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా ప్రకటించింది. ఈ మొత్తం కేసు 1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై ఉంది. ఇది దాణా కుంభకోణంలో ఐదవ కేసు మాత్రమే కాకుండా, అతిపెద్ద కేసు కూడా. తాజా తీర్పుతో పశుగ్రాసం కుంభకోణానికి చెందిన మొత్తం ఐదు కేసుల్లోనూ లాలూ దోషిగా నిలిచారు. తీర్పు సందర్భంగా లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి సీకే శశి తీర్పును వెలువరించారు.


ఈ కేసులో 98 మంది ఇతర నిందితులు సైతం కోర్టుకు హాజరు కాగా, వీరిలో 24 మందిని నిర్దోషులుగా కోర్టు తీర్పు చెప్పింది. తక్కిన వారిలో 35 మందికి మూడేళ్ల జైలుశిక్ష విధించింది. వీరిలో మాజీ ఎంపీ జగదీష్ శర్మ, అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ ధ్రువ్ భగత్ ఉన్నారు. కాగా, ఈ కేసులో దోషులుగా నిర్ధారణ అయిన లాలూ సహా 39 మంది శిక్షాకాలాన్ని ఈనెల 21న కోర్టు ప్రకటించనుంది.


కాగా, పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో లాలూ ఇప్పటికే దోషిగా నిర్ధారణ అయ్యారు. అబే చైబాసా ట్రెజరీ నుండి 37.7 కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నందుకు సంబంధించిన మొదటి కేసులో లాలూ ప్రసాద్‌కు 5 సంవత్సరాల శిక్ష పడింది. దేవఘర్ ట్రెజరీ నుంచి నిధుల ఉపసంహరణ కేసులో మూడున్నరేళ్లు శిక్ష, చైబాసా ట్రెజరీ నుండి 33.13 కోట్లు అక్రమంగా ఉపసంహరించుకున్న మూడవ కేసులో 5 సంవత్సరాల శిక్ష పడింది. దుమ్కా ట్రెజరీ నుంచి 3.76 కోట్లు అక్రమంగా విత్‌డ్రా చేయడంపై నాలుగో కేసులో రెండు వేర్వేరు సెక్షన్లలో 7 - 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. లాలూ ఈ నాలుగు కేసులను గతంలో సవాలు చేశారు. ఐదో కేసును కూడా సవాలు చేసే అవకాశం ఉంది. దుమ్కా కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన లాలూ ప్రస్తుతం జైలు నుంచి బయట ఉన్నారు.

Updated Date - 2022-02-15T18:44:50+05:30 IST