మాయలేడి.. ఐదుగురిని పెళ్ళాడిన యువతి
ABN , First Publish Date - 2022-09-17T16:00:25+05:30 IST
కానిస్టేబుల్ సహా ఐదుగురిని పెళ్ళాడి లక్షలాది రూపాయల నగదు, నగలను దోచుకున్న కరూరుకు చెందిన సౌమ్యా అలియాస్ శబరి (28) అనే
- మంత్రి బంధువంటూ మోసాలు
చెన్నై, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్ సహా ఐదుగురిని పెళ్ళాడి లక్షలాది రూపాయల నగదు, నగలను దోచుకున్న కరూరుకు చెందిన సౌమ్యా అలియాస్ శబరి (28) అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కరూరు మారియమ్మన్ కోవిల్ ప్రాంతానికి చెందిన ఆ యువతి తల్లిదండ్రులతో గొడవపెట్టుకుని రామనాధపురంలోని ఓ ల్యాడ్జీలో ఉండేది. ఆ సమయంలో పరిచయం అయిన రాజేష్ అనే కానిస్టేబుల్(Constable)ను వివాహం చేసుకుంది. కొద్ది నెలలపాటు ఆయనతో కాపురం చేసిన సౌమ్య పోలీసు శాఖలో తనకు పలుకుబడి ఉందంటూ ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి వద్ద లక్షలాది రూపాయలను వసూలు చేసి నగలు, నగదుతో ఉడాయించింది. ఆ తర్వాత రామనాధపురానికి చెందిన సతీష్ అనే యువకుడిని, కరూరుకు చెందిన ఆటో డ్రైవర్ ఇలా మరో నలుగురిని పెళ్ళి చేసుకుని నగలు, నగదును దోచుకెళ్ళింది. ఇలా ఐదుగురిని పెళ్ళి చేసుకుని నాలుగైదు నెలలపాటు వారితో కాపురం చేసిన సౌమ్య కరూరు గాంధీగ్రామం ప్రాంతంలో ఓ ఇంటిలో నివశిస్తూ విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్బాలాజీ తన బంధువని చెబుతూ ప్రభుత్వ ఉద్యోగాల పేరిట పలువురి నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసగించింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి గురువారం రాత్రి సౌమ్యను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో ఐదుగురిని పెళ్ళి(marriage) చేసుకుని మోసగించిన వివరాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.