చీమల గూడు తగలబెట్టపోయి తనే అగ్నికి ఆహుతైంది!

ABN , First Publish Date - 2020-11-23T22:11:08+05:30 IST

సంగీత గదిలో చీమలు ఎక్కువయ్యాయి. చీమల వల్ల ఆమెకు చాలా చిరాకు వస్తోంది. దీంతో వాటి పని పట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే అదనుగా ఆదివారం తల్లితో కలిసి తన గదిని మొత్తం శుభ్రం చేసింది

చీమల గూడు తగలబెట్టపోయి తనే అగ్నికి ఆహుతైంది!

చెన్నై: ఇంట్లో ఉన్న చీమల గూడును తగలబెట్టడానికి ప్రయత్నించి అదే నిప్పుకు బలైంది ఓ యువతి. దాదాపు 90 శాతం శరీరం కాలిపోవడంతో ఆమెను కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. తమిళనాడులోని అమింజికరై పట్టణంలో ఆదివారం జరిగిందీ దారుణం. అమింజకరైలోని , పెరుమాల్ కోయిల్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న ఎస్. సంగీత (27) అనే యువతి, షోలింగానల్లూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తోంది. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేసేవాడు. అయితే లాక్‌డౌన్ కారణంగా అది కాస్త కోల్పోయాడు. అప్పటి నుంచి సంగీత ఆదాయంతోనే ఇల్లు గడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి పని చేసినప్పుడు కూడా సంగీత ఆదాయంతో ఇళ్లు గడుస్తోంది. ఇక అదే కోవిడ్ కారణంగా సంగీత ఇంటి నుంచి పని చేస్తోంది.


కాగా, సంగీత గదిలో చీమలు ఎక్కువయ్యాయి. చీమల వల్ల ఆమెకు చాలా చిరాకు వస్తోంది. దీంతో వాటి పని పట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే అదనుగా ఆదివారం తల్లితో కలిసి తన గదిని మొత్తం శుభ్రం చేసింది. ఈ తరుణంలో ఇంట్లో ఒక చీమల గూడు కనిపించింది. గూడు మొత్తాన్ని ఒకేసారి కాల్చేయలనుకుని ఒక పేపర్‌పై కిరోసిన్ పోసి చీమల గూడుకు తగిలించింది. చీమలు గూడు వదిలి ఎటు పడితే అటు కదిలాయి. ఇలా సంగీతపై కొన్ని పడ్డాయి. వాటిని దులుపుకునే క్రమంలో ఆమెపై కిరోసిన్ పడింది. క్షణ కాలంలో ఆమెను అంటుకున్న మంట, చూస్తుండగానే దావానలంగా మారింది.


సంగీతతో పాటు ఆమె తల్లికి కూడా నిప్పు అంటుకుంది. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తల్లి స్వల్పంగా గాయపడడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. కాకపోతే సంగీత శరీరం 90 శాతం కాలిపోవడంతో బతకలేకపోయిందని వైద్యులు తెలిపారు. సంగీత పాలిస్టర్ బట్టలు వేసుకొని ఉండడం ఈ ప్రమాదానికి ఒక కారణమని, లేదంటే ఈ ప్రభావం కాస్త తక్కువగా ఉండేదని వారు తెలిపారు.

Updated Date - 2020-11-23T22:11:08+05:30 IST