బతుకు భారమై..
ABN , First Publish Date - 2020-03-28T06:54:56+05:30 IST
పాత రోజులు గుర్తొస్తున్నాయి. ‘పెద్దలమాట సద్ది మూట’ అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. నెత్తిమీద పెద్ద మూట.. భుజంపై పిల్లలు...
- వలస కూలీలకు కరోనా కష్టాలు
- లాక్డౌన్తో నిలిచిన పనులు
- పనిలేక సొంతూళ్లకు పయనం
- రవాణా సౌకర్యం లేక నడుచుకుంటూ..
- మార్గమధ్యలో ఆకలి, దాహంతో అవస్థలు
పరిగి: పాత రోజులు గుర్తొస్తున్నాయి. ‘పెద్దలమాట సద్ది మూట’ అన్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. నెత్తిమీద పెద్ద మూట.. భుజంపై పిల్లలు.. ఓ చేతిలో బస్తా, మరో చేతిలో సద్దిమూట. దారిపొడవునా ఎటు చూసినా వలస కూలీలు కనిపిస్తున్నారు. ఒకరిద్దరు కాదు.. వందల్లో కూలీలు పట్టణాలు వదిలి స్వగ్రామాలకు పయనమవుతున్నారు.
కరోనాతో కూలీలపై తీవ్ర ప్రభావం పడింది. లాక్డౌన్ కారణంగా పట్టణంలో పనులన్నీ నిలిచిపోయాయి. దీంతో పనిలేక బతుకు భారంగా మారింది. ఐదు రోజులుగా హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు కాలినడకను సాగిస్తున్నారు. మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ, పరిగి, కొడంగల్, నారాయణపేట్, కోస్గి, దౌల్తాబాద్, మన్నెగూడ, వికారాబాద్, ధారూర్, తాండూరు వరకు వందల కి.మీ. పొడవునా కాలినడకన స్వగ్రామాలకు వెళ్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో దాదాపుగా 11 లక్షల జనాభా ఉంటుంది. ఇందులో రెండు లక్షల మంది కూలీలు, రైతు కూలీలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటారని అంచనా వేస్తున్నారు.