కేవైసీ అప్డేట్ పేరుతో ఆర్మీ రిటైర్డ్ అధికారికి కుచ్చుటోపీ
ABN , First Publish Date - 2021-06-15T12:39:27+05:30 IST
కేవైసీ పేరుతో మొబైల్కు లింక్ ఉన్న మెసేజ్ పంపి...
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : కేవైసీ పేరుతో మొబైల్కు లింక్ ఉన్న మెసేజ్ పంపి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు అతని వద్ద లక్షన్నర కాజేశారు. సికింద్రాబాద్లో నివసించే రిటైర్డ్ ఆర్మీ అధికారి ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. మీ సిమ్ కేవైసీ అప్డేట్ చేయాలని, లేదంటే సిమ్ బ్లాక్ అవుతుందని, వెంటనే సిమ్ అప్డేట్ చేయడానికి కింద సూచించిన లింక్ను క్లిక్ చేయాలనేది మెసేజ్ సారాంశం. అది చూసిన వెంటనే అతను లింక్ క్లిక్ చేయగానే ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
తాను టెలికామ్ కార్యాలయం నుంచి కాల్ చేస్తున్నానని, లింక్ ద్వారా ఓపెన్ అయిన ఎనీడెస్క్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేయాలని, ఆ తర్వాత పది రూపాయాలు పంపించడం ద్వారా యాప్ను యాక్టివేట్ చేయాలని చెప్పాడు. అన్నట్లుగానే చేశాడు. ఈ లోగా ఫోన్కు రెండు మూడు మెసేజ్లు వచ్చాయి. ఫోన్కాల్ లైన్లో ఉన్న వ్యక్తి మెసేజ్లలో ఉన్న నెంబర్లు చెప్పమనగానే ఇతను చెప్పాడు. దీంతో సదరు అధికారి బ్యాంకు ఖాతా నుంచి లక్షన్నర వరకు డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత కాల్ కట్చేసిన వ్యక్తి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు చేశాడు.