కువైట్ మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలకు అనుమతి
ABN , First Publish Date - 2020-07-15T17:56:50+05:30 IST
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా మసీదులను మూసి ఉంచిన కువైట్... ఈ వారం నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ నేపథ్యంలో గత నాలుగు నెలలుగా మసీదులను మూసి ఉంచిన కువైట్... ఈ వారం నుంచి శుక్రవారం ప్రార్థనలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైట్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా సుమారు 1000 మసీదులు తెరచుకోనున్నాయి. కాగా, ప్రార్థనలకు 30 నిమిషాల ముందు మసీదులు తెరవాలని... అలాగే ప్రార్థనలు ముగిసిన 15 నిమిషాల తర్వాత క్లోజ్ చేసేయాలని అధికారులు ఆదేశించారు. అంతేగాక ప్రార్థనలకు వచ్చేవారు తప్పకుండా ముఖాలకు మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం పాటించడం, సొంత ప్రేయర్ మ్యాట్స్ తెచ్చుకోవాలని సూచించారు. అలాగే 15 ఏళ్లలోపు పిల్లలకు మసీదుల్లో అనుమతించకూడదని అధికారులు తెలిపారు.