విదేశీయుల రాకపై నిషేధాన్ని పొడిగించిన కువైట్ !

ABN , First Publish Date - 2021-03-05T18:49:58+05:30 IST

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది.

విదేశీయుల రాకపై నిషేధాన్ని పొడిగించిన కువైట్ !

కువైట్ సిటీ: గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. నెల రోజుల పాటు రాత్రి వేళ కర్ఫ్యూ విధించింది. అలాగే విదేశీయుల రాకపై నిషేధాన్ని కూడా పొడిగించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు విదేశీయుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతోందని పేర్కొంది. ఇక కర్ఫ్యూ విషయానికి వస్తే ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ నెల 7వ తేదీ నుంచి ఏప్రిల్ 8 వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి. కర్ఫ్యూ సమయంలో ప్రజలు మసీదులు, మెడికల్ షాపులకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.


అలాగే ఈ ఆంక్షలు అమలు చేయడంలో పోలీసులకు నేషనల్ గార్డ్ ఫోర్సెస్ సహకరించాల్సిందిగా ఆ దేశ విదేశాంగ, కేబినెట్ వ్యవహారాల మంత్రి డాక్టర్ షేక్ అహ్మద్ నాజర్ అల్ మొహమ్మద్ అల్ సబా ఆదేశించారు. అంతేగాక వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశ పౌరులు, నివాసితులు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు.     

Updated Date - 2021-03-05T18:49:58+05:30 IST