రెసిడెన్సీ వీసాదారులకు కువైట్ తీపి కబురు !
ABN , First Publish Date - 2020-07-04T19:46:45+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులకు అక్కడి సర్కార్ తీపి కబురు అందించింది.
కువైట్ సిటీ: కరోనా లాక్డౌన్ వల్ల వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులకు అక్కడి సర్కార్ తీపి కబురు అందించింది. రెసిడెన్సీ వీసాలు కలిగి ఉన్న ప్రవాసులు తిరిగి కువైట్కు రావొచ్చని ప్రకటించింది. ఆగస్ట్ 1వ తేదీ నుంచి అర్హత కలిగి వీసాదారులు కువైట్ వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది. అలాగే కమర్షియల్ విమాన సర్వీసులు కూడా అదే రోజున ప్రారంభం కానున్నాయి. అయితే, కువైట్ వచ్చే రెసిడెన్సీ వీసాదారులు కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పాటిస్తున్నా అన్ని మార్గదర్శకాలను అనుసరించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.
అలాగే కువైట్ వచ్చాక హోం క్వారంటైన్ లేదా ప్రభుత్వ, ఇతర సంస్థలు ఏర్పాటు చేసే క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు అంగీకరిస్తూ ముందుగానే సంతకం చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అంతేగాక కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్, విమానం ఎక్కడానికి ముందే శ్లోనిక్లో రిజిస్టర్ కావడం తప్పనిసరి అని సూచించారు. ఇదిలా ఉంటే.. కువైట్లో కల్లోలం సృష్టిస్తున్న మహమ్మారి కరోనా ఇప్పటి వరకు 48,672 మందికి సోకింది. ఈ వైరస్ బారిన పడ్డ వారిలో 39,279 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 360 మందిని కోవిడ్ కబళించింది.