సంబరం.. పిడకల సమరం
ABN , First Publish Date - 2022-04-04T02:31:08+05:30 IST
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు.
ఆదోని: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో కొట్టుకున్నారు. ప్రతి ఏటా ఉగాది మురుసటి రోజు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
సాంప్రదాయ ప్రకారం..
కారుమంచి గ్రామం నుంచి పెద్దరెడ్డి వంశస్థుడైన నరసింహారెడ్డి గుర్రంపై మందీమార్బలం, తప్పెట్లు మేళతాళాలతో కైరుప్పల గ్రామానికి ఆదివారం సాయంత్రం వచ్చారు. వీరభద్రస్వామి, కాళికాదేవి ఆలయంలో పూజలు చేసి వెనుదిరగగానే పిడకల సమరం మొదలైంది. అక్కడ గుమిగూడిన జనం వీరభద్రస్వామి, భద్రకాళి వర్గీయులుగా విడిపోయారు. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకున్నారు. ఒకసారి ఒక వర్గం వారి పైచేయి కాగా.. మరోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమ వర్గం వారు గెలవాలన్న తపంతో మహిళలు సైతం పిడకలు అందిస్తూ వారికి సహాయంగా నిలిచారు. కుప్పలుగా వేసిన పిడకలు అవి అయిపోయేంతవరకు ఈ పోరు కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి బండారు అంటించుకుని వెళ్లారు. సమరం ముగిసిన తర్వాత గ్రామ పెద్దలు పంచాయితీ చేసి దేవతామూర్తుల వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్క గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.