కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులను విస్మరిస్తోంది: Bopparaju
ABN , First Publish Date - 2021-12-07T18:54:08+05:30 IST
ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు: ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఉద్యోగులను విస్మరిస్తోందని విమర్శించారు. ఉద్యమంతో ప్రజలకు అసౌకర్యం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఐక్య కార్యాచరణ ప్రకటించే ముందు.. ప్రభుత్వానికి సమయం ఇచ్చినా స్పందన లేదన్నారు. జనవరి 6న ప్రాంతీయ సదస్సుల వరకు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా సంయమనం పాటించామని చెప్పారు. ఉద్యోగుల మంచితనాన్ని ప్రభుత్వం చులకనగా చూడొద్దన్నారు. సమావేశాల్లో ఉద్యోగ సంఘాలను అధికారులు అవమానించారని మండిపడ్డారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. దాచుకున్న డబ్బులు ఉద్యోగుల ప్రమేయం లేకుండా గలంతయ్యాయన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం విస్మరించారని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు విమర్శలు గుప్పించారు.