కురిచేడు ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించిన ఎస్పీ

ABN , First Publish Date - 2020-08-11T21:29:14+05:30 IST

కురిచేడు ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఎనిమిది రకాల కంపెనీల పేరుమీద ఉన్న 69 రకాల శానిటైజర్ బాటిళ్లను ఘటన ప్రాంతంలో గుర్తించామని

కురిచేడు ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడించిన ఎస్పీ

ప్రకాశం : కురిచేడు ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఎనిమిది రకాల కంపెనీల పేరుమీద ఉన్న 69 రకాల శానిటైజర్ బాటిళ్లను ఘటన ప్రాంతంలో గుర్తించామని ఎస్పీ తెలిపారు. వాటి ఆధారంగా తయారీ యూనిట్లను గుర్తించామన్నారు. ఘటన ప్రాంతంలో దొరికిన ఫర్ఫెక్ట్ గోల్డ్ శానిటైజర్ బాటిల్‌పై బ్యాచ్ నెంబర్ లేకుండా ఉండటంతో అనుమానం వచ్చి వాటిపై ఉన్న అడ్రస్‌ల ఆధారంగా కేసును చేధించామని చెప్పారు. ఫేక్ కంపెనీల పేరుతో బెల్ట్ షాపులలో అమ్మే విధంగా శానిటైజర్లను 100 ఎంఎల్ రూ. 50 చొప్పున అమ్మారని ఎస్పీ వివరించారు. నిందితుడు శ్రీనివాస్ పెట్రోల్ బంకులో పనిచేసిన అనుభవంతో కెమికల్స్‌ని శానిటైజర్‌లో వాడటంతో కురిచేడు ఘటనకు కారకుడయ్యాడని పేర్కొన్నారు. మొదటి డిస్ట్రిబ్యూషన్ హైదరాబాద్, అనంతరం వివిధ ప్రాంతాలలో జరిగిందని వెల్లడించారు. గతంలోనే హైదరాబాద్ జీడిమెట్ల ప్రాంతంలో ఇతని అక్రమ తయారీ యూనిట్‌పై అధికారులు దాడి చేయగా లంచం ఇచ్చి తప్పించుకున్నాడని ఎస్పీ కౌశల్ వివరించారు. శానిటైజర్ తయారీపై పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమ వ్యాపారం చేశాడన్నారు. కోవిడ్ 19ను తన అక్రమ ఆదాయ వనరుగా మార్చుకున్నాడని తెలిపారు. ఫర్‌ఫెక్ట్ గోల్డ్ హ్యాండ్ బాటిల్ లేబుల్‌పై వందనా ఫార్మా బెంగుళూరు అడ్రస్ ఉండటంతో అక్కడకు వెళ్లిన సిట్ వందన ఫార్మా పేరిట ఎటువంటి కంపెనీలు లేవని తేల్చిందని ఎస్పీ వెల్లడించారు. దీనిపై విచారణను కొనసాగిస్తామని, కురిచేడులో ఓ వివాహ కార్యక్రమంలో కూడా శానిటైజర్‌ను మద్యంగా ఉపయోగించి పార్టీ చేసుకున్నట్లు గురించామన్నారు. ఘటనపై అత్యంత తక్కువ టైంలో వేగవంతంగా పనిచేసి సిట్ బృందాలు ఛేదించాయని, సిట్ బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు.

Updated Date - 2020-08-11T21:29:14+05:30 IST