ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించం

ABN , First Publish Date - 2020-06-02T15:22:29+05:30 IST

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని..

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సహించం

మంత్రి కురసాల కన్నబాబు


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే  ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కురసాల కన్నబాబు హెచ్చరించారు. వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్‌ ఎరీనాలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నివేశనా స్థలాలు, పట్టణ, గ్రామీణ, నీటి సరఫరాపై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే నెల ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామన్నారు.


తాగునీటికి సంబంధించి సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు నీటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు చేపడతామన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని సూచించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా రూపొందనున్న నేపథ్యంలో  కొత్తగా నగరాన్ని నిర్మించుకోవలసిన అవసరం ఉందన్నారు. 


కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి గ్రామీణ మండలాల్లో అర్హులైన 65 వేల మందికి సుమారు 15 వందల ఎకరాల్లో ఇళ్లస్థలాలు గుర్తించడం జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాలలో సుమారు 3800 ఎకరాల భూమి  ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బి.సత్యవతి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, జీవీఎంసీ కమిషనర్‌ సృజన, జేసీ వేణుగోపాలరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T15:22:29+05:30 IST