తాతయ్య మృతిపై నెటిజన్ ట్వీట్.. చలించిన కేటీఆర్

ABN , First Publish Date - 2020-03-26T16:13:13+05:30 IST

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లపై ప్రభుత్వాల హెచ్చరికల కంటే ముందే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు.

తాతయ్య మృతిపై నెటిజన్ ట్వీట్.. చలించిన కేటీఆర్

హైదరాబాద్: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లపై ప్రభుత్వాల హెచ్చరికల కంటే ముందే రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగానే కాకుండా.. సోషల్ మీడియా వేదికగా ఏ చిన్న విన్నపం వచ్చినా తక్షణం స్పందిస్తూ.. అధికారులకు మార్గదర్శకాలను జారీ చేస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు తన తాతయ్య మృతిపై ట్వీట్ చేశారు. కూచిపూడిలో మంగళవారం గుండెపోటుతో తన తాతయ్య మరణించారని.. ఆయన కడసారి చూపులకు నగరం నుంచి వెళుతుంటే పోలీసులు తమను అడుగడుగునా అడ్డుకున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్యారడైజ్ చెకింగ్ పాయింట్ దగ్గర అయితే తమను మానసికంగా వేధించారని తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా పోలీసుల బాధను తాము అర్థం చేసుకోగలమని.. కానీ తాతయ్య చివరి చూపులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేగాక దీనిపై స్పందించాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. 



Updated Date - 2020-03-26T16:13:13+05:30 IST