బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

ABN , First Publish Date - 2021-03-06T20:01:45+05:30 IST

కేసీఆర్ కులబలం, మజిల్ బలం లేకుండానే ప్రయాణం ప్రారంభించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

హైదరాబాద్: కేసీఆర్ కులబలం, మజిల్ బలం లేకుండానే ప్రయాణం ప్రారంభించారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి తెలంగాణ జెండా పట్టారన్నారు. రాష్ట్రం వచ్చేవరకు పోరాటం చేయకపోతే రాళ్లతో కొట్టండన్న దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని, ఆయన కష్టంతో తెలంగాణ వచ్చిందన్నారు. దేశంలో సగర్వంగా నిలబడిందని చెప్పారు. అలాంటి నేతపై ఉద్యమంలో అడ్రస్ లేనివారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ మాట్లాడే బఫూన్ గాళ్లకంటే ఎక్కువ మాట్లాడే సత్తా కేసీఆర్‌కు ఉందన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ లాంటిదని.. వాళ్లకంటే చీల్చి చెండాడే సత్తా తమకుందన్నారు.


బీజేపీ నేతలది వాట్సప్ యూనివర్సిటీ అంటూ ఎద్దేవా చేశారు. వాళ్లకు ఏమీ తెలియదని, కొత్త జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇవ్వమంటే కేంద్రం ఇవ్వలేదన్నారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన కేంద్రం తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ భారత దేశంలో లేదా? ఎందుకీ వివక్ష? ఐఐటీ, ఐఐఎంలు ఇవ్వని బీజేపీ ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ నేతలకు తిట్టుడు తప్ప.. తెలివి లేదు..  మన్ను లేదన్నారు. సీఎంలను ఉరికించిన చరిత్ర తమ పార్టీదని.. వాళ్లను ఉరికించుడు తమకు పెద్ద లెక్క కాదన్నారు. అందరి లెక్కలు రాస్తున్నామని, మిత్తితో చెల్లిస్తామన్నారు. ఓటుకు నోటు గాడు వొర్రి వొర్రి ఖతం అయ్యాడని, కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదన్నారు.  


Updated Date - 2021-03-06T20:01:45+05:30 IST