దేవరకద్రను మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి KTR
ABN , First Publish Date - 2022-06-04T21:43:13+05:30 IST
మహబూబ్నగర్: జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం దేవరకద్రను మున్సిపాలిటీగా మారుస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తకోట,
మహబూబ్నగర్: జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం దేవరకద్రను మున్సిపాలిటీగా మారుస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తకోట, దేవరకద్రలలో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. పల్లెటూర్లకు అపార్ట్మెంట్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే తమ పార్టీ ధ్యేయమన్నారు.
ప్రతిపక్షాలు సైంధవ పాత్ర పోషిస్తున్నాయని KTR ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం జాతీయ హోదా ఇస్తామని మోసగించిందన్నారు. కృష్ణానదిలో తమకున్న 575 టీఎంసీల నీటివాటా ఇవ్వటంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన సెస్సు వాటా ఇవ్వకపోగా.. రూ. 2 లక్షల కోట్లను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని..ఇందులో నిజం లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించాడు.