లారీని ఢీకొన్న కేఎస్ ఆర్టీసీ బస్సు
ABN , First Publish Date - 2022-10-04T05:34:42+05:30 IST
ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. 23 మంది గాయపడ్డారు.
ఇద్దరి మృతి..23మందికి గాయాలు
మృతులు తమిళనాడు వాసులు
చిత్తూరు, అక్టోబరు 3: ఆగి ఉన్న లారీని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. 23 మంది గాయపడ్డారు. కర్ణాటకలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కోలారు ఆర్టీసీ డిపో ట్రాఫిక్ ఆఫీసర్ జైశాంత్ తెలిపిన ప్రకారం.. కేఎస్ ఆర్టీసీ సర్వీస్ ఆదివారం రాత్రి 9.30 గంటలకు పాలసముద్రం మండలం బలిజకండ్రిగ నుంచి బయలుదేరింది. చిత్తూరుకు చేరుకుని ప్రయాణికులను ఎక్కించుకుని బెంగళూరుకు వెళుతోంది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు-కోలారు మార్గంలో రిపేరు కారణంగా ఆగిపోయిన లారీని వేగంగా వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో వేలూరు జిల్లా షోలింగర్ తాలూకా కల్లూరు పేటకు చెందిన దంపతులు మురుగన్(40), సెల్వి(38) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 23 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఎంవీజే ఆస్పత్రిలో చేర్పించారు. మృతులిద్దరూ బెంగళూరులో మేస్త్రీ పనిచేస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించి, సోమవారం మృతదేహాలను బంధువులకు అప్పగించామని ట్రాఫిక్ ఆఫీసర్ తెలిపారు.