KRMB: ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం
ABN , First Publish Date - 2021-09-02T00:32:11+05:30 IST
కృష్ణా జలాల్లో పంపకంపై జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం
హైదరాబాద్: కృష్ణా జలాల్లో పంపకంపై జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ కార్యదర్శులు, కేఆర్ఎంబీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ వాదనలను ఇరిగేషన్ అధికారులు బలంగా వినిపించారు. కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం లేఖలు రాస్తోందని తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా బేసిన్ నుంచి ఏపీ తరలిస్తున్న నీటిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిగా అక్రమ ప్రాజెక్ట్ అని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పట్టుపట్టారు. శ్రీశైలం హైడల్ పవర్పై ఏపీ అభ్యంతరం చెప్పింది. కృష్ణా నది మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని ఏపీ అధికారులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా కడుతున్న ప్రాజెక్టులకు అనుమతి లేదని ఏపీ వాదించింది.