బుజ్జగింపులు

ABN , First Publish Date - 2020-11-08T10:12:27+05:30 IST

టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది.

బుజ్జగింపులు

తీగలతో మాట్లాడిన కేటీఆర్‌ 

ఎమ్మెల్సీ ఇస్తామంటూ హామీ!

తాత్కాలికంగా వెనక్కి తగ్గిన తీగల కృష్ణారెడ్డి


 (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని అధిష్ఠానం బుజ్జగించింది. శనివారం మంత్రి కేటీఆర్‌ ఆయన్ని పిలిచి మాట్లాడారు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న తీగల బీజేపీవైపు చూస్తున్నట్లు ప్రచారం జరగడంతో          టీఆర్‌ఎస్‌ నాయకత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. స్వయంగా మంత్రి కేటీఆర్‌ తీగలను ప్రగతిభవన్‌కు పిలిచి బుజ్జగించారు. పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.  దీంతో ఆయన తాత్కాలికంగా వెనక్కితగ్గారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం కేటీ           ఆర్‌ను కలిసిన తీగలకృష్ణారెడ్డి తన ఇబ్బందులను వివరించారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో కేటీఆర్‌ మీకుపార్టీలో ఎలాంటి ఇబ్బంది రానివ్వనని,  మీకు సరైన సమయంలో సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో సీనియర్లైన మీరే ఇలా చేస్తే ఎలా? పార్టీకి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని చెప్పారు. మీకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, వీలైతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని లేదంటే తగిన గుర్తింపు ఉండే పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల ముందు ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని తీగలను బుజ్జగించారు.


దీంతో తీగల కాస్త మెత్తబడ్డారు. అయితే  కేటీఆర్‌ను కలిసిన తరువాత సీఎం కేసీఆర్‌ను కలవకుండానే తీగల వచ్చేశారు. కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆయన దీనిపై మాట్లాడేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతానికి ఎలాంటి వివాదం లేదని చెప్పారు. టీఆర్‌ఎ్‌సలోనే కొనసాగుతానని తెలిపారు. ఇదిలా ఉంటే అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డికి మంత్రి సబితారెడ్డి కూడా ఫోన్‌చేసి మాట్లాడారు.  సఖ్యత కోసం యత్నించారు. అపోహలు పడవద్దని అందరం కలిసి పనిచేద్దామని మంత్రి సబితారెడ్డి కోరారు. కేటీఆర్‌తో పాటు ఇతరనేతల బుజ్జగింపుతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతానికి ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడడం లేదు.

Updated Date - 2020-11-08T10:12:27+05:30 IST