కంటితుడుపు మాటలొద్దు

ABN , First Publish Date - 2020-08-14T10:55:09+05:30 IST

అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమ త్యాగాలను గుర్తించాలని రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొన

కంటితుడుపు మాటలొద్దు

తుళ్లూరు/తాడికొండ, ఆగస్టు 13 : అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన తమ త్యాగాలను గుర్తించాలని రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఆందోళనలు గురువారం 240వ రోజుకు చేరాయి. తుళ్లూరులో రైతులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేపట్టారు. పెదపరిమి, వెలగపూడి, రాయపూడి, మందడం, అబ్బరాజుపాలెం గ్రామాల్లోని రైతులు దీక్షా శిబిరాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు వ్యక్తంచేస్తున్న రైతులు, మహిళలపై ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తోందన్నారు.


మూడు రాజధానులపై ముఖ్యమంత్రి పునరాలోచన చేయాలని కోరారు. రాజధాని రైతులకు మద్దతుగా పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో నిరసన దీక్షలు నిర్వహించారు. దీక్షలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ.. సీనియర్‌ నేత మన్నవ సుబ్బారావుతో కలిసి గుంటూరులోని తన నివాసంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.

Updated Date - 2020-08-14T10:55:09+05:30 IST