అతిథి సత్కారమే యజ్ఞం!

ABN , First Publish Date - 2020-03-06T05:40:47+05:30 IST

జీవితాన్ని యజ్ఞంలా భావించాలి. ప్రకృతిని బలపరచాలి. ‘దేవుడికి నైవేద్యం పెట్టడమంటే మొక్కలకు నీళ్లు పోయడం, వాటిని సంరక్షించడమే!..

అతిథి సత్కారమే యజ్ఞం!

జీవితాన్ని యజ్ఞంలా భావించాలి. ప్రకృతిని బలపరచాలి. ‘దేవుడికి నైవేద్యం పెట్టడమంటే మొక్కలకు నీళ్లు పోయడం, వాటిని సంరక్షించడమే!’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత మూడో అధ్యాయం పదమూడో శ్లోకంలో స్పష్టంగా వివరించాడు. 

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే  సర్వకిల్బిషైః

భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్‌

ఆధునిక జీవనంలో మనం కోల్పోయిన ఒక అవకాశం అతిథి సేవ. ఇవ్వాళ ఇంటికి చుట్టాలొస్తే భరించగలిగే శక్లి లేదు. మేనత్తలు, మేనమామలు, పినతండ్రులు ఇంటికి రావడమే మానేశారు. మన ఆదరణ అలాగే ఉంది. వాళ్ల ఆత్మీయతా అలాగే ఉంది. ఎక్కడో హోటల్‌లో దిగుతారు. ‘‘బిజినెస్‌ పని మీదొచ్చాను. బిజీగా ఉన్నాను. మళ్లీ వచ్చినప్పుడు కలుస్తాను’’ అని చెప్పి వెళ్లిపోతుంటారు. వచ్చేంత తీరిక వారికి ఉన్నా, రమ్మనేంత ప్రేమ మనకు లేదు. పండిన పంట, ఉన్న పాడిలో ప్రకృతి శక్తుల్ని బలపరచడం కోసం యజ్ఞం రూపంలో సమర్పించవలసింది సమర్పించిన తరువాతే మిగిలిన దాన్ని మనం ఆహారంగా స్వీకరించాలి. జీవితాన్ని యజ్ఞంలా భావించాలి. పంచభూతాలను, అతిథులను పోషించిన తరువాత మిగిలిన ఆహారాన్నే తినాలి. అప్పుడే పాపం లేకుండా ఉంటుంది. అలాకాకుండా పాపాత్ములు పాపాన్ని వండుకొని తింటున్నారు. ‘‘అతిథులనే వారే లేకుండా, తన కుటుంబం మాత్రమే వండుకుని తింటున్నారంటే పాపాన్ని వండుకొని తింటున్నట్టే లెక్క!’’ అని రుగ్వేదంలోనే చెప్పారు. ఒక్క అతిథికైనా భోజనం పెట్టాలి. ఎవరూ దొరక్కపోతే కాస్త ఆహారం తీసుకెళ్లి చెట్టు పక్కన వదిలేయాలి. సూక్ష్మజీవులు తింటాయి. దీన్ని అందరం పాటిద్దాం!



-డా. గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-03-06T05:40:47+05:30 IST