కృష్ణమ్మ తగ్గుముఖం
ABN , First Publish Date - 2022-08-14T06:08:34+05:30 IST
కృష్ణమ్మ తగ్గుముఖం
ఒకటో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
ప్రకాశం బ్యారేజీకి తగ్గిన ఇన్ఫ్లో
సముద్రంలోకి 3.39 లక్షల క్యూసెక్కులు
విజయవాడ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఉరకలేసుకుంటూ వస్తున్న కృష్ణమ్మ నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో తగ్గడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను శనివారం ఉపసంహరించారు. ప్రస్తుతం ఎగువ నుంచి 3 లక్షల 39 వేల 305 క్యూసెక్కుల నీరు వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3 లక్షల 31 వేల 517 క్యూసెక్కుల నీరు బ్యారేజీని తాకుతోంది. పాలేరు నుంచి 1,341, కీసర నుంచి 6,003 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. బ్యారేజీ 70 గేట్లలో ఐదింటిని తొమ్మిది అడుగుల మేర పైకెత్తారు. మరో 65 గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి 3 లక్షల 29 వేల 455 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. కాల్వలకు 14,517 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కృష్ణా తూర్పు బ్రాంచ్ కెనాల్కు 1,452, బందరు కాల్వకు 1,456, ఏలూరు కాల్వకు 1,457, రైవస్ కాల్వకు 4,118, కృష్ణా పశ్చిమ కాల్వకు 6,034 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ టెయిల్పాండ్ నుంచి మాత్రం నీటి విడుదల స్థిరంగా కొనసాగుతోంది. సాగర్ నుంచి 3 లక్షల 91 వేల 128 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 3 లక్షల 40 వేల 821 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
పులిగడ్డ ఆక్విడెక్టును తాకిన కృష్ణమ్మ
అవనిగడ్డ రూరల్ : పులిగడ్డ ఆక్విడెక్టును తాకుతూ కృష్ణమ్మ ప్రవహిస్తోంది. ఇరిగేషన్ డీఈ రవికిరణ్ మాట్లాడుతూ మరో రెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద 15 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోందని చెప్పారు.