ఏర్పాట్లు కుంభమేళాను తలపించాలి..

ABN , First Publish Date - 2021-11-27T05:03:00+05:30 IST

ఏర్పాట్లు కుంభమేళాను తలపించాలి..

ఏర్పాట్లు కుంభమేళాను తలపించాలి..
సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణఆదిత్య

- మేడారం సమ్మక-సారలమ్మ జాతర పనుల్లో 

అధికారులంతా భాగస్వాములు కావాలి 

- నిర్మాణాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి

- సెక్టోరియల్‌ అధికారులకు కలెక్టర్‌ కృష్ణఆదిత్య సూచన

ములుగు కలెక్టరేట్‌, నవంబరు 26 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు కుంభమేళాను తలపించేలా ఘనంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్‌ కృష్ణఆదిత్య సెక్టోరియల్‌ అధికారులకు సూచించారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవమైన మేడారం జాతరకు వచ్చే ప్రతీ భక్తుడికి మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని, నిర్మాణాలు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని వివరించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో సెక్టోరియల్‌ అధికారులతో శుక్రవారం జరిగిన జాతర పనులపై సమీక్షలో ఆయన మాట్లాడారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికారులంతా భాగస్వాములవ్వాలన్నారు. తాగునీరు, టాయ్‌లెట్స్‌, పార్కింగ్‌ ఏరియాలు ఎక్కడెక్కడున్నాయో టీం అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో ఉన్న విద్యుత్‌ స్థంభాలతో పాటు అదనంగా అవసరం ఉంటే నివేదిక సమర్పించాలని సూచించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవడం ద్వారా పార్కింగ్‌ ఏరియాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రయివేటు పట్టా భూ ములైతే రైతుతో మాట్లాడి ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పార్కింగ్‌ స్థలాల్లో విద్యుత్‌ లైట్లను పెంచాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టాయిలెట్ల ప్రాంతాల్లో నిరంతరం లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎస్పీ సాయిచైతన్య మాట్లాడుతూ గత జాతర సందర్భంగా పార్కింగ్‌ ఏరియాల్లో కొంత ఇబ్బంది జరిగిందన్నారు. కరెంటు స్తంభాలను క్రమపద్ధతిలో ఉంచడంతో పాటు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. బ్యాటరీఆఫ్‌ ట్యాప్స్‌ వద్ద నీరునిల్వ ఉండకుండా చూడాలని తెలిపారు. పార్కింగ్‌ స్థలాల్లో తవ్విన మట్టిని అలాగే వదిలేయకుండా ర్యాంపుల నిర్మాణానికి ఉపయోగించాలని సూచించారు. ఈసారి జాతరలో విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా 200 ట్రాన్స్‌పార్మర్లను ఏర్పాటుచేస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ మల్చుర్‌ తెలిపారు. అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఆర్డీవో కె.రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డీఎల్‌పీవో దేవరాజు, తహసీల్దార్‌లు శ్రీనివాస్‌, సత్యనారాయణ స్వామి, నాగరాజు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో శ్యామ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌ రాజ్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T05:03:00+05:30 IST