బాలింత మృతిపై వివాదం

ABN , First Publish Date - 2020-08-15T15:55:00+05:30 IST

వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు..

బాలింత మృతిపై వివాదం

క్రాంతి ఆసుపత్రి వద్ద ఆందోళన


అనంతపురం(ఆంధ్రజ్యోతి): వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుటే ఆందోళనకు దిగిన సంఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్రాంతి ఆసుపత్రి వద్ద జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు.. శింగనమల మండలం అలంకరాయపేటకు చెందిన శివశేషారెడ్డి భార్య అనూష(21)కు పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గురువారం క్రాంతి ఆస్పత్రికి తీసుకువచ్చారు. గర్భం దాల్చడం తొలిసారి కావడంతో మొదటి నుంచి ఆమె ఈ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంది. వైద్యులు పరీక్షలు చేసి సిజేరియన్‌ చేయాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్‌ చేయగా కుమార్తె జన్మించింది.


అయితే రక్తస్రావం ఆగకపోవడంతో అనూష పరిస్థితి విషమించి మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే అనూష మృతి చెందిందని ఆమె బంధువులు యాజమాన్యంతో గొడవకు దిగారు. వివాదం ముదరడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి శాంతింపజేశారు. ఆస్పత్రి డాక్టర్‌లు మాత్రం సరైన వైద్య సేవలు అందించామని ఫిట్స్‌ రావడంవల్లే సమస్య ఏర్పడిందని తెలిపారు. బంధువులు మాత్రం వైద్యుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని కన్నీటి పర్యంతమయ్యారు.


Updated Date - 2020-08-15T15:55:00+05:30 IST