తక్కువ టైంలోనే పిల్లలకు వ్యాక్సినేషన్!
ABN , First Publish Date - 2021-10-25T08:34:34+05:30 IST
చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఒక్కసారి మార్కెట్లోకి రాగానే చాలా తక్కువ సమయంలోనే వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మంచి అనుభవాన్ని దేశం గడించింది.
- అనుభవం గడించిన సిబ్బంది..
- చిన్నారుల కోసం రెండు కొవిడ్ టీకాలకు ఇప్పటికే అనుమతి
- వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సీరం కొవావాక్స్
- వారంలో ఫైజర్ పిల్లల టీకాకు ఎఫ్డీఐ ఆమోదం!
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : చిన్నారులకు కొవిడ్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఒక్కసారి మార్కెట్లోకి రాగానే చాలా తక్కువ సమయంలోనే వారికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మంచి అనుభవాన్ని దేశం గడించింది. పైగా టెక్నాలజీ, టీకా ఉత్పత్తి సామర్థ్యం పెరగడంతో తక్కువ సమయంలోనే ఎక్కువ డోసులు లభ్యం కానున్నాయి. ప్రస్తుతం దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారికే కొవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. దేశంలో 18 ఏళ్లలోపు 41 కోట్ల మంది పిల్లలు ఉన్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వారిలో రెండేళ్లలోపు పిల్లలు రెండు కోట్ల మంది ఉంటారని అంచనా. మిగిలిన 39 కోట్ల మంది పిల్లలకే కొవిడ్ వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలో పిల్లల టీకాలకు సంబంధించి రెండు కంపెనీ వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు లభించాయి. వాటిలో భారత్ బయోటెక్ వారి కొవాక్సిన్ కాగా, రెండోది జైడస్ క్యాడిలా వారి జైడస్. కొవాక్సిన్ 2-18 వయసు వారికైతే, జైడస్ 12-18 ఏళ్ల వారి కోసం తయారు చేస్తున్నారు.
28 రోజుల వ్యవధిలో కొవాక్సిన్ రెండు డోసులు వేయవచ్చు. జైడస్ మాత్రం ప్రతి 30 రోజులకోమారు మూడు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండేకాక సీరం ఇన్స్టిట్యూట్ వారి కొవావాక్స్ కూడా క్లినికల్ ట్రయల్స్లో ఉంది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి తమ టీకా అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ సీఈఓ ఆధార్ పూనావాలా ఇప్పటికే ప్రకటించారు. సీరం కొవావాక్స్ను 7-11 ఏళ్ల పిల్లల కోసం తయారు చేస్తున్నారు. ఇవి కాక బయోలాజికల్-ఈ సంస్థ ఐదేళ్లు పైబడిన వారి కోసం కొవిడ్ టీకాను తయారు చేయబోతోంది. ఫైజర్ కంపెనీ కూడా 5-11 ఏళ్ల వారి కోసం ఇప్పటికే టీకాను తయారు చేసింది. రెండు రోజుల క్రితం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఫైజర్ విడుదల చేసింది. వచ్చే వారం ఫైజర్ పిల్లల కొవిడ్ టీకాకు ఎఫ్డీఐ అనుమతి ఇవ్వనుందని సమాచారం.
వ్యాక్సినేషన్కు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధం
పిల్లల కొవిడ్ వ్యాక్సినేషన్కు ప్రభుత్వ అనుమతి రాగానే టీకాలు వేసేందుకు ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఆ మేరకు ప్రచారాన్ని ప్రారంభించాయి. తమ ఆస్పత్రితో పాటు విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల వద్దకే వచ్చి వ్యాక్సిన్ ఇస్తామంటున్నాయి.
నెలకు 150 కోట్ల డోసుల ఉత్పత్తి
ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారి కోసమే కొవిడ్ వ్యాక్సిన్ను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కలపి నెలకు 150 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అంటే రోజుకు 5 కోట్ల డోసులు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక మన దేశం విషయానికొస్తే రోజుకు 80 లక్షల డోసులు ఉత్పత్తి అవుతున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.