ఆగస్టులో పిల్లలకు కొవిడ్‌ టీకా

ABN , First Publish Date - 2021-07-28T08:22:18+05:30 IST

పిల్లల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆగస్టులో అందుబాటులోకి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

ఆగస్టులో పిల్లలకు కొవిడ్‌ టీకా

న్యూఢిల్లీ, జూలై 27: పిల్లల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆగస్టులో అందుబాటులోకి వస్తుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. మరోవైపు అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా కంపెనీ తమ మూడు డోసుల కొవిడ్‌ టీకాను 12 ఏళ్లకు పైబడిన వారందరికీ ఇచ్చేందుకు అత్యవసర వినియోగ అనుమతులను కోరుతూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ 2-18 ఏళ్ల వారం దరిపైనా కొవాగ్జిన్‌ను పరీక్షిస్తోంది. ఈ టీకా సెప్టెంబరుకల్లా పిల్లలకు అందుబాటులోకి రావచ్చంటున్నారు. కాగా, దేశంలో రోజువారీ కరోనా కేసుల తగ్గుదల రేటు నెమ్మదించడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 7 రాష్ట్రాల్లోని 22 జిల్లాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అజాగ్రత్త వహించవద్దని ప్రజలకు సూచించారు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రాలకు 50 కోట్ల టీకాలను ఇవ్వడం కష్టమేనన్న ఊహాగానాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మరో 6.03 కోట్ల డోసులను ఈ నెలాఖరులోపు ఇస్తామని స్పష్టం చేసింది. కొవాగ్జిన్‌కు అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ భారత్‌ బయోటెక్‌ సమర్పించిన దరఖాస్తును తిరస్కరించినట్లు బ్రెజిల్‌ వెల్లడించింది. 


‘ఆక్సిజన్‌’ కొరత మరణాలెన్ని: కేంద్రం 

కొవిడ్‌ రెండో వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత వల్ల చనిపో యిన వారి వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఆక్సిజన్‌ కొరత వల్ల సెకండ్‌ వేవ్‌లో వందలాది మంది చనిపోయారని యూపీలోని గోపమ్‌వూ బీజేపీ ఎమ్మెల్యే శ్యామ్‌ప్రకాశ్‌ అన్నారు. యూపీ లో వ్యాక్సినేషన్‌ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో డాక్టరు గాయపడ్డారు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

Updated Date - 2021-07-28T08:22:18+05:30 IST