‘కరోనా’ చికిత్సా కేంద్రాలుగా స్టార్ హోటళ్లు
ABN , First Publish Date - 2021-04-17T17:17:02+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుండడంతో స్టార్ హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేలా ఒప్పందం చేసుకున్నామని
- నగరంలోని 3 మెడికల్ కళాశాలల్లో 1800 పడకలు
- త్వరలోనే కరోనా పరీక్షలకెళతా: మంత్రి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోతుండడంతో స్టార్ హోటళ్లను తాత్కాలిక ఆసుపత్రులుగా మార్చేలా ఒప్పందం చేసుకున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ తెలిపారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా 10 స్టార్ హోటళ్లతో ఒప్పందం చేసుకున్నామన్నారు. శుక్రవారం పలు సందర్భాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 5వేల పడకలు కొవిడ్ బాధితులకు రిజర్వు చేసేలా సూచించామన్నారు. త్రీ, ఫోర్, ఫైవ్స్టార్ హోటళ్లను తాత్కాలికంగా ఆసుపత్రులుగా మార్చేందుకు అంగీకారం కుదిరిందన్నారు. అవసరమైన వైద్య చికిత్సలు అందించేందుకు అన్ని ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంగా ఉండాలని సూచించామన్నారు. బెంగళూరు మెడికల్ కళాశాల, కిమ్స్, సెయింట్జాన్స్ మెడికల్ కళాశాల ఆసుపత్రులను సందర్శించానని తక్షణంగా 1800 పడకలు కొవిడ్ బాధితులకు అందుబాటులో ఉన్నాయన్నారు. విక్టోరియాలో కొవిడ్ బాధితులకు 400 పడకలు ఉండేవని, వాటిని 750కు పెంచామన్నారు. సమీపంలోని రెండు హోటళ్లను తాత్కాలికంగా గుర్తించామన్నారు. తక్కువ లక్షణాలు ఉండేవారికి 200 పడకలు సిద్ధం చేశామని ఇలా విక్టోరియా ఆసుపత్రి పరిధిలో 950 పడకలు సిద్ధమన్నారు. వీటిలో 70 ఐసీయూ విభాగాలు ఉన్నాయన్నారు. సీఎం యడియూరప్పకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడం, అంతకు అరగంట ముందు అత్యవసర సమావేశంలో మంత్రి సుధాకర్ పాల్గొన్నారు. ఈమేరకు ఆయన పరీక్షలకు లేదా హోం క్వారంటైన్కు వెళ్లాలని సోషల్మీడియాలో పలువురు డిమాండ్ చేశారు. దీనిపై ఆయన స్పందించారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో పడకలు, సౌలభ్యాలకోసం నిరంతరం సమీక్షలు చేయాల్సి న అవసరం ఏర్పడిందన్నారు. ప్రస్తుతానికి 30వేల రెమిడిసివర్ మందు అందుబాటులో ఉందని, తాజాగా 20వేలు రాష్ట్రానికి వచ్చిందని మరో 70వేలు అవసరంగా కేంద్రాన్ని కోరామన్నారు. నాలుగురోజుల తర్వాత కొవిడ్ పరీక్షలు చేయించుకుంటానన్నారు.
మరిన్ని ఆంక్షలు..
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున వివాహాది ఇతరత్రా శుభ కార్యాలపైనా ఆంక్షలు విధించారు. ఈమేరకు శుక్రవారం రాత్రి ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేశారు. పెళ్లిళ్లు బయట ప్రాంతాలలో 200 మందికి, కల్యాణమండపాలు, హాళ్లలో అయితే వందమందికి, బర్త్డే తదితర కార్యక్రమాలకు బయటి ప్రదేశంలో 50 మంది, హాళ్లలో 25 మందికి అనుమతించారు. అంత్యక్రియలకు 25కు మించి పాల్గొనరాదని సూచించారు. అన్ని ధార్మిక కార్యక్రమాలు రద్దు చేశారు. ఆర్కియలాజికల్ విభాగం కేంద్ర కమిటీ తమ పరిధిలోని అన్ని ఆలయాలను నెలరోజులపాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శిల్పకళాక్షేత్రాలు మూతపడ్డాయి.