కొవిడ్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2021-05-13T04:49:05+05:30 IST
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కట్టడి దిశగా కొవిడ్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు సూచించారు.
ప్రొద్దుటూరు క్రైం, మే 12 : కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో కట్టడి దిశగా కొవిడ్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసు అధికారులకు సూచించారు. బుధవారం ప్రొద్దుటూరు వచ్చిన ఎస్పీ ఇక్కడ కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. కర్ఫ్యూ అమలుపై డీఎస్పీ ప్రసాదరావు, సీఐలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. అనంతరం డీఎస్పీ ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి మనందరి చేతుల్లోనే ఉందని, ప్రతి ఒక్కరు కొవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈద్గాలో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి లేదన్నారు. మసీదుల్లో 50 మంది మాత్రమే ప్రార్థనలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రంజాన్ రోజున ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవడం ఎంతో ఉత్తమమన్నారు. మధ్యాహ్నం 12 తర్వాత అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు పెడతామని డీఎస్పీ హెచ్చరించారు. సీఐలు నాగరాజు, నరసింహరెడ్డి, క్రిష్ణయ్యలు ఉన్నారు.