మెడికల్‌ కాలేజీల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలి

ABN , First Publish Date - 2021-04-21T06:20:33+05:30 IST

జిల్లాలోని ప్రతిమ, చల్మెడ మెడికల్‌ కాలేజీల్లో కొవిడ్‌ రోగులకు వెంటనే చికిత్సను ప్రారంభించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు.

మెడికల్‌ కాలేజీల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ కె శశాంక

-కలెక్టర్‌ కె శశాంక

కరీంనగర్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ప్రతిమ, చల్మెడ మెడికల్‌ కాలేజీల్లో కొవిడ్‌ రోగులకు వెంటనే చికిత్సను ప్రారంభించాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో చాంబర్‌లో ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతిమ, చల్మెడ మెడికల్‌ కాలేజీల్లో ఒక్కొక్కటి వెయ్యి పడకల సామర్థ్యం కలిగి ఉన్నాయన్నారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున రోగులు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. జిల్లాలో ప్రతిమ, చల్మెడ అతి పెద్ద ఆసుపత్రుల్లో ఇంతవరకు కోవిడ్‌ చికిత్స ప్రారంభించలేదని, వెంటనే ప్రారంభించాలని సూచించారు. ప్రతిమ, చల్మెడ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ కొరత ఉందని తెలుపగా, సమస్యలుంటే మా దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామన్నారు. ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యం కరోనా ఉధృతి దృష్ట్యా వెంటనే కొవిడ్‌ చికిత్సను ప్రారంభించాలని కోరారు. సమావేశంలో ప్రతిమ మెడికల్‌ కాలేజీ నుంచి డాక్టర్‌ అమిత్‌, చల్మెడ ఆసుపత్రి నుంచి డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి, జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్‌ రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:20:33+05:30 IST