కొవిడ్‌ కల్లోలం

ABN , First Publish Date - 2021-05-04T05:08:49+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది.

కొవిడ్‌ కల్లోలం

ఒక్కరోజే 1,960 కేసులు

చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతి

కోలుకున్న 891 మంది డిశ్చార్జ్‌


విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది. ఒకపక్క వందలాది మంది వైరస్‌ బారినపడుతుంటే...మరోపక్క చికిత్స పొందుతూ ఎంతోమంది మృత్యువాత చెందుతున్నారు. ప్రతిరోజూ ఏడెనిమిది మంది చనిపోతున్నట్టు అధికారులు చెబుతుండగా, అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఇదిలావుంటే సోమవారం ఒక్కరోజే చికిత్స పొందుతూ తొమ్మిది మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. వీటితో జిల్లాలో కొవిడ్‌ మరణాలు 635కు చేరాయి. మూడు రోజుల వ్యవధిలో 24 మంది కొవిడ్‌కు బలయ్యారు. పాజిటివ్‌ కేసులు కూడా సోమవారం రికార్డు స్థాయిలో 1,960 నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 85,536కు చేరింది. చికిత్స పొందుతూ సోమవారం 891 మంది కోలుకోవడంతో రికవరీల సంఖ్య 71,766కు పెరిగింది. మరో 13,135 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, ఇళ్ల వద్ద చికిత్స పొందుతున్నారు. విమ్స్‌లో పడకలన్నీ నిండిపోవడంతో కొత్తగా ఎవరికీ బెడ్‌ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వైరస్‌ బాధితులు ఆస్పత్రుల ప్రాంగణంలో బెడ్‌ కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. 


Updated Date - 2021-05-04T05:08:49+05:30 IST