గూడూరు పీఠం దక్కించుకుంటాం
ABN , First Publish Date - 2021-03-07T05:39:51+05:30 IST
గూడూరు నగర పంచాయతీని కైవసం చేసుకుంటామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం గూడూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థులు, నాయకులతో కోట్ల సమావేశం నిర్వహించి.. నగర పంచాయతీ ఎన్నికలపై చర్చించారు.
- టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
గూడూరు, మార్చి 6: గూడూరు నగర పంచాయతీని కైవసం చేసుకుంటామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం గూడూరు పట్టణంలో టీడీపీ అభ్యర్థులు, నాయకులతో కోట్ల సమావేశం నిర్వహించి.. నగర పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం టీడీపీ కష్టపడుతున్న తీరును ప్రజలకు వివరించి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ నాయకుల మాయమాటలను నమ్మి మోసపోరాదని, నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. వేదవతి, గుండ్రేవుల, ఆర్డీఎస్, ఎల్లెల్సీ కాలువ వంటి వాటిపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎందుకు అడగడం లేదని కోట్ల ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతాంగానికి సాగు, ప్రజలకు తాగునీరు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్, సీనియర్ టీడీపీ నాయకులు విజయ రాఘవరెడ్డి, రాజారెడ్డి, ఆకేపోగు బతుకన్న, చరణ్ కుమార్, చెట్టుకింది మద్దిలేటి, దండు సుందర రాజు, రేమట సురేష్, కళ్యాణ్ రఘుబాబు, కృష్ణ, మూలగేరి లక్ష్మన్న పాల్గొన్నారు.