ఈ ఏడాదిలోనూ ఆటుపోట్లే
ABN , First Publish Date - 2021-01-14T06:46:01+05:30 IST
ప్రస్తుత సంవత్సరంలో (2021) కూడా మార్కెట్లో ఆటుపోట్లు తప్పవని కొటక్ మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ అంచనా వేస్తోంది. ఊహించని విధంగా మార్చి నాటి కనిష్ఠ
మార్కెట్పై కొటక్ మహీంద్రా అసెట్ అంచనా
వ్యాక్సినేషనే కారణం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత సంవత్సరంలో (2021) కూడా మార్కెట్లో ఆటుపోట్లు తప్పవని కొటక్ మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ అంచనా వేస్తోంది. ఊహించని విధంగా మార్చి నాటి కనిష్ఠ స్థాయిల నుంచి మార్కెట్ కోలుకుంది. అయితే.. ప్రపంచ వ్యాప్తం గా కొవిడ్ వ్యాక్సినేషన్ కారణంగా మార్కెట్లో ఈ ఏడాది కూడా ఆటుపోట్లు తప్పవని భావిస్తున్నట్లు కొటక్ మహీంద్రా అసెట్ మేనేజిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) నీలేశ్ షా తెలిపారు. వ్యాక్సిన్ సమర్థత, పంపిణీ, అమలుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల మార్కెట్లో ఒడిదుడుకులు ఉండొచ్చని వ్యాఖ్యానించారు. 2020లో ఎఫ్పీఐలు దేశీయ మార్కెట్లోకి రూ.60 వేల కోట్లు తీసుకువచ్చారు. రిటైల్ మదుపర్ల పెట్టుబడులు కూడా ఆకర్షణీయంగా పెరిగాయి. 2020లో 49 లక్షల డిమ్యాట్ ఖాతాలు ప్రారంభమైనట్లు చెప్పారు.
గత దశాబ్ద కాలంలో ఒక ఏడాదిలో ప్రారంభమైన అత్యధిక డీమ్యాట్ ఖాతాలు ఇవే. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 22.5 శాతం పెరిగాయి. గత ఏడాది డిసెంబరు చివరి నాటికి మొత్తం 4.08 కోట్ల ఖాతాలు ఉన్నట్లు షా చెప్పారు. మెరుగైన ఆర్థిక వ్యవస్థ మూలాలు, ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాల కారణంగా మార్కెట్ పెరిగింది. భవిష్యత్తులో మార్కెట్ దిశను రెండు అంశాలు నిర్దేశించగలవని అందులో ఒకటి ద్రవ్యోల్బణం, రెండోది కంపెనీల లాభాలని పేర్కొన్నారు.