Rosaiah హయాంలోనే హైదరాబాద్ ‘మెట్రో’కు బీజం.. అమ్మ మిమ్మల్ని మెచ్చుకొందయ్యా..!
ABN , First Publish Date - 2021-12-05T14:46:56+05:30 IST
వైఎస్ మరణానంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ...
- నగర హైటెక్ రవాణాలో మాజీ ముఖ్యమంత్రి పాత్ర
హైదరాబాద్ సిటీ : నగరంలో ట్రాఫిక్ రహితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థికశాఖ మంత్రిగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించిన అంచనా బడ్జెట్ను పరిశీలించారు. వైఎస్ మరణానంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించనున్న మెట్రోకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తూ నిధులు మంజూరు చేయడంతో వేగంగా అడుగులు పడ్డాయి. కాగా, 2010 సెప్టెంబర్ 4న ఆయన సమక్షంలోనే ప్రాజెక్టు రాయితీ ఒప్పందం పూర్తయింది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పీపీపీ తరహాలో మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేస్తున్నామని నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి సీఎం హోదాలో రోశయ్య లేఖ రాశారు. స్పందించిన సోనియాగాంధీ ఆయనను అభినందిస్తూ మరో లేఖను పంపించారు. ఇదిలా ఉండగా తాను సీఎం రోశయ్య చాంబర్కు ఒకసారి వెళ్లినప్పుడు తనతో ఆప్యాయంగా మాట్లాడారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ‘అమ్మ మిమ్మల్ని మెచ్చుకొందయ్యా’ అని ప్రేమతో అన్నారని తెలిపారు. రోశయ్య మృతికి ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.