kondapalli crafts: ‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్’ను నిర్వహిస్తున్న టాటా టీ చక్ర గోల్డ్
ABN , First Publish Date - 2022-10-01T01:16:15+05:30 IST
నాలుగు శతాబ్దాలకుపైగా వారసత్వం కలిగిన కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కలిగించేందుకు టాటా చక్ర
విజయవాడ: నాలుగు శతాబ్దాలకుపైగా వారసత్వం కలిగిన కొండపల్లి బొమ్మలకు మరింత ప్రాచుర్యం కలిగించేందుకు టాటా చక్ర గోల్డ్ టీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్’ నిర్వహిస్తోంది. దేశ, విదేశాల్లో ఖ్యాతి గాంచిన కొండపల్లి కళారూపాలు గ్రామీణ జీవితం, జానపద కళలు, జంతువులకు జీవం పోస్తాయి. మహోన్నతమైన ఈ కళారూపం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్లాస్టిక్ బొమ్మలు విరివిగా లభిస్తుండటం, ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా కొండపల్లి కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కొండపల్లి బొమ్మలకు తగిన ప్రాచుర్యం కల్పించేందుకు టాటా టీ చక్ర గోల్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు చెందిన లేపాక్షితో భాగస్వామం కుదుర్చుకుంది. లేపాక్షి సంస్ధ ఇప్పుడు కొండపల్లి బొమ్మలను తమ ఈ–కామ్ సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటుగా కొనుగోలు చేయాల్సిందిగా కళాభిమానులను ప్రోత్సహిస్తోంది. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి కొండపల్లి బొమ్మకు టాటా టీ చక్ర గోల్డ్ 100 రూపాయలను కొండపల్లి కళాకారులు, కళారూపానికి అందజేస్తుంది. దీంతోపాటు ఈ బ్రాండ్ ఇప్పుడు కొండపల్లి ఆర్ట్తో ప్రత్యేకంగా నవరాత్రి పండుగ ప్యాక్లను సైతం విడుదల చేసింది.
ఈ సందర్భంగా టాటా కన్జుమర్ ప్రొడక్ట్స్ ప్యాకేజ్డ్ బేవరేజస్ (ఇండియా-దక్షిణాషియా) ప్రెసిడెంట్ పునీత్ దాస్ మాట్లాడుతూ.. ‘మన కొండపల్లి బొమ్మలు ఉత్సవ్’ ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కనుమరుగవుతున్న వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ మీడియా కో ఆర్డినేటర్, కన్సల్టెంట్ హెడ్ ఆఫీస్ ఐహెచ్పీ రావు మాట్లాడుతూ.. టాటా చక్ర గోల్డ్ టీ తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా కనుమరుగవుతున్న కళారూపాలను పునరుద్ధరించడం, కళాకారుల సంక్షేమానికి తోడ్పడటం సాధ్యమవుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.