తేళ్లు తెచ్చాం స్వామీ..!
ABN , First Publish Date - 2020-08-11T16:19:34+05:30 IST
కొండల రాయుడికి భక్తులు తేళ్లను సమర్పించారు. ఏటా శ్రావణ మాసం..
భక్తితో కొండలరాయుడి వేడుక
కోడుమూరు(కర్నూలు): కొండల రాయుడికి భక్తులు తేళ్లను సమర్పించారు. ఏటా శ్రావణ మాసం మూడో సోమవారం ఈ వేడకను నిర్వహిస్తారు. కోడుమూరు సమీపంలోని కొండ్రాయి కొండపై వెలసిన వేంకటేశ్వరున్ని స్థానికులు కొండల రాయుడిగా కొలుస్తారు. ఈ కొండపై ఏ చిన్న రాయిని కదిపినా తేళ్లు కనిపిస్తాయి. వాటిని పట్టుకుని స్వామికి సమర్పించే వింత ఆచారం కొన్ని తరాలుగా కొనసాగుతోంది. పొరపాటున కుట్టినా స్వామికి మూడు సార్లు ప్రదక్షిణ చేసి మొక్కుకుంటారు. తమకు ఎలాంటి నొప్పీ కలగదని భక్తులు అంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ అన్ని వయసుల వారూ ఈ వేడుకలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పలువురు భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
కుట్టకపోవడం వింతే
చిన్న పిల్లలు కూడా తేళ్ళను పట్టుకోవడం అద్భుతం. కొండపైకి వచ్చి ఈ వింతను చూడటం ఆనందంగా ఉంది. కొండల రాయుడు మహిమ గల దేవుడని నమ్ముతున్నాం. ఏటా వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుంటాము.
- లలిత, కోడుమూరు
కళ్లారా చూడాలని..
భక్తితో స్వామిని స్మరించుకుని రాళ్ల కింద ఉన్న తేలుని పట్టుకుని స్వామికి సమర్పించాము. ఈ వింతను కళ్లారా చూడాలని కొండపైకి కాలి నడకన వచ్చాము. స్వామిని దర్శించుకున్నాము. సంతోషంగా ఉంది.
- విజయలక్ష్మి, కోడుమూరు