వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నాయకులపై కేసులు
ABN , First Publish Date - 2021-05-10T16:12:17+05:30 IST
ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు..
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం టౌన్: ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, మందులులేక కరోనా రోగులు ఆర్తనాదాలు చేస్తున్నా సీఎం జగన్మోహన్రెడ్డికి వినిపించడం లేదని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిర్ధిష్ట ప్రణాళిక లేకపోవడం వల్ల కొవిడ్ నివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. తన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. జగన్ పాలన అంతా ప్రతిపక్ష నాయకులపై కేసులు బనాయించడమేనన్నారు. ఎన్ 400కే వేరియంట్పై మీడియా సంస్థలు ముందే హెచ్చరించా యన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం వైసీపీ ప్రభుత్వం లెక్క చేయడం లేదన్నారు. బ్లాక్ మార్కెట్లో రెమిడీసీవర్ ఇంజెక్షన్లు రూ. 50వేలకు పైగా విక్రయిస్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. అంబులెన్స్లు ఇష్టారాజ్యంగా రోగుల నుంచి డబ్బు పిండుతున్నారన్నారు. ఇప్పటికైనా సీఎం మొద్దునిద్ర విడనాడాలన్నారు. లేనిపక్షంలో ప్రజాక్షేత్రంలో దెబ్బ తినక తప్పదన్నారు.